- వరుసగా రెండోరోజూ పార్లమెంట్లో నిరసన
- అన్ని కార్యకలాపాలు రద్దుచేసి చర్చించాలని డిమాండ్
- గందరగోళం మధ్య ఉభయ సభలు సోమవారానికి వాయిదా
న్యూ దిల్లీ, జూలై 21 : వరుసగా రెండోరోజూ మణిపూర్ ఘటన పార్లమెంట్ను కుదిపేసింది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో గందరోగళం చెలరేగింది. చివరకు ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అన్ని కార్యకలాపాలను రద్దు చేసి కేవలం మణిపూర్ ఘటనలపైనే చర్చించాలని విపక్ష సభ్యులు మూకుమ్మడిగా డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. శుక్రవారం రెండో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో ఎగువ, దిగువ సభలను వాయిదా వేశారు. లోక్ సభ ప్రారంభంకాగానే మణిపూర్ అంశం పై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు.
ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మణిపూర్ హింస, తాజా అంశాలపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. అన్ని కార్యకలాపాలనూ పక్కనపెట్టి.. మణిపూర్ అంశంపై మాత్రమే సుదీర్ఘంగా చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొనడంతో.. సభను మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ప్రకటించారు. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చారు. అయితే ప్రతిపక్ష సభ్యులు ఎంతకూ శాంతించకపోవడంతో లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు. తొలుత మధ్యాహ్నం వరకు తరవాత మొత్తంగా సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు.
అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై చర్చ జరపడంపై ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదని ఆరోపించారు. ఈ సమస్యపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారన్నారు. అయినప్పటికీ, ప్రతిపక్షాలు చర్చకు సిద్ధపడటం లేదని, దీనిని బట్టి వారికి ఈ సమస్య పట్ల శ్రద్ధ లేదని స్పష్టమవుతుందని అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వి•డియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ గురువారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు మాట్లాడారని, మణిపూర్ సంఘటన వల్ల యావత్తు దేశం సిగ్గుతో తలదించు కుంటుందని చెప్పారని అన్నారు. ప్రస్తుతం మణిపూర్లో చాలా సున్నితమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దోషులను అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. మణిపూర్ పరిస్థితిపై శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఈ సమస్య గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతున్నా కానీ మన పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదని విమర్శించారు.
మణిపూర్లో శాంతిభద్రతల గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. ‘నిర్భయ’ కేసులో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అప్పటి ప్రభుత్వాన్ని వణికించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీ మొసలి కన్నీరు కార్చుతుందన్నారు. మెయిటీలు, కుకీల మధ్య మే 3 నుంచి ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం టాగూర్ మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడాలని డిమాండ్ చేశారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ రాజ్యసభ కార్యకలాపాలను నిలిపేయాలని రూల్ 267 ప్రకారం నోటీసు ఇచ్చారు. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మణిపూర్ పరిస్థితిపై సభలో ప్రకటన చేయాలన్నారు.
ఇక మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ స్పందిస్తూ, ఇలాంటి సంఘటనలు వందలాదిగా జరుగుతున్నాయని చెప్పారని, అలాంటపుడు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అటు రాజ్యసభ కార్యకలాపాలను నిలిపేయాలని రూల్ 267 ప్రకారం బీఆర్ఎస్ ఎంపీ కే కేశవ రావు నోటీసు ఇచ్చారు. మణిపూర్ పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో కాంగ్రెస్ ఎంపీలు డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, శక్తిసింహ్ గోహిల్, రంజీత్ రంజన్, ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ కూడా రాజ్యసభకు నోటీసులు ఇచ్చారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కూడా ఈ రూల్ ప్రకారం నోటీసు ఇచ్చారు. మణిపూర్ సమస్య గురించి లోక్సభలో చర్చించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఇదిలావుండగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రెండో రోజు లోక్సభలో మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం ఏర్పడటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు.




