ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 21 : 2023 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మంచి ముహూర్తంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డిని తిరిగి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లే విరుస్తున్నాయి.ఒకానొక క్రమంలో మంచి రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇస్తారని అనుకున్న నేపథ్యంలో తిరిగి మంచి రెడ్డి కిషన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అభ్యర్థిని ప్రకటించిన నాటినుండి నియోజకవర్గంలోని పలు మండలాలలో,మునిసిపాలిటీలలో ప్రజలతో కలసి వారి బాగోగులను చూడాలని కేసీఆర్ ఆదేశించడంతో నేటి నుండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజలతో మమేకం కాబోతున్నారు.ఆయనకు తోడుగా బిఆర్ఎస్ శ్రేణులు ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తూ బిఆర్ఎస్ పార్టీని తిరిగి మరోసారి ఇబ్రహీంపట్నంలో గెలిపించుకొని బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలన్నదే సంకల్పంగా కార్యకర్తలు,నాయకులు కంకనబద్దులవుతున్నారు.



