భగ్గుమన్న బాలనగర్ మెదక్ జాతీయ రహదారి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బహుజన వర్గాల నేత  నీలం మధు ముదిరాజ్ కి  మద్దతుగా నిరసనల పర్వం కొనసాగుతుంది.బీఅర్ఎస్ పార్టీ  పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే టైంలో  ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చేయి చూపడం పట్ల ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా పటాన్ చెరు నియోజకవర్గంలో అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బీసీ, సబ్బండ  వర్గాలకు నాయకుడు నీలం మధుకి బీ అర్ ఎస్ టిక్కెట్ ను విస్మరించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.
శనివారం గుమ్మడిదల మండలం అన్నారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి బైఠాయించారు.నీలం మధు ముదిరాజ్ కి పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ ను  కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఐదు టికెట్లను ఇవ్వడంతోపాటు చట్టసభలలో బీసీల ప్రాతినిధ్యం పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా సబ్బండ వర్గాల ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు టికెట్ పై పునరాలోచించి, బీసీ నేత నీలం మదుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయిలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయింపు లో అన్యాయం చేయడం సరికాదన్నారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని వెల్లడించారు. కెసిఆర్ ఆలోచించి టికెట్టు మార్చకపోతే నీలం మధు ముదిరాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్లు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, ఎంఎంఆర్ యువసేన సభ్యులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *