ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు
నూతన మంత్రివర్గం ఏర్పాటు
అక్టోబర్లో కొత్త ప్రధానికి అవకాశం
లండన్, జూలై 7 : బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్దర్మ ప్రధానిగా ఆయన కొనసాగుతారు. దీని కోసం ఆయన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబరు నాటికి నూతన ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు ఆ దేశ డియా చెప్తోంది. బోరిస్ జాన్సన్ దాదాపు మూడేళ్ళపాటు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తాను ప్రపంచంలో అత్యుత్తమ పదవిని వదులుకుంటున్నట్లు బోరిస్ చెప్పారు.
ప్రధాన మంత్రిగా తన వైఫల్యాల పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నూతన ప్రధాని నియమితుడయ్యే వరకు తాను పదవిలో కొనసాగుతానని చెప్పారు. తన వైఫల్యాలకు విచారం వ్యక్తం చేస్తూ, తన విజయాల పట్ల తాను గర్వపడుతున్నానని తెలిపారు.
ఆయనకు అత్యంత సన్నిహితుడైన ట్రెజరీ చీఫ్ నధిమ్ జహవి సలహా మేరకు ఆయన రాజీనామా చేసినట్లు బ్రిటిష్ డియా వెల్లడించింది. జాతిని ఉద్దేశించి బోరిస్ మాట్లాడుతూ, కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు, మంత్రివర్గ సహచరుల పిలుపును శిరసావహిస్తూ నేను ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. బోరిస్ తర్వాత భారత సంతతికి చెందిన రుషి సునక్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బోరిస్ రాజీనామాపై భారత ప్రభుత్వం స్పందిస్తూ, ఇది ఆ దేశ అంతర్గత వ్యవహారమని పేర్కొంది.



