బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్

విచారణ నుంచి తప్పుకున్న సుప్రీమ్‌ ‌కోర్టు మహిళా జడ్జి !
గుజరాత్‌, ‌డిసెంబర్‌ 13 : ‌గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల సందర్భంగా గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కు గురై, తన మూడేళ్ల కూతురు సహా పలువురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్ ‌చోటు చేసుకుంది. ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన ఏడుగురిని సత్ప్రవర్తన పేరుతో విడిచి పెట్టిన గుజరాత్‌ ‌ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో బిల్కిస్‌ ‌బానో సవాల్‌ ‌చేసింది. దీనిపై విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో మహిళా జడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బిల్కిస్‌ ‌బానో కేసులో దోషుల్ని విడుదల చేస్తూ గుజరాత్‌ ‌ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ ‌చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ ‌పై జస్టిస్‌ అజయ్‌ ‌రస్తోగీ, జస్టిస్‌ ‌బేలా త్రివేదీతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. అయితే ఈ విచారణ నుంచి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ‌బేలా త్రివేదీ అనూహ్యంగా తప్పుకున్నారు.

విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తాను తప్పుకుంటున్నట్లు బేలా త్రివేదీ ప్రకటించారు. దీంతో తన సోదర మహిళా న్యాయమూర్తి బేలా త్రివేదీ ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ ‌రస్తోగీ ప్రకటించారు. బిల్కిస్‌ ‌బానో కేసు దోషుల విడుదలను సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ ‌విచారణ నుంచి మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ‌బేలా త్రివేదీ తప్పుకోవడం వెనుక కారణాలు వెల్లడి కాలేదు. దీంతో ఈ వ్యవహారం అనుమానాస్పదంగా మారుతోంది. అయితే బేలా త్రివేదీ తప్పుకోవడంతో ఈ ధర్మాసనం స్ధానంలో మరో బెంచ్‌ ‌కు ఈ పిటిషన్‌ ‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ చేయబోతున్నారు. అనంతరం తిరిగి విచారణ ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *