- ధరలు పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప చేసిందేమీ లేదు
- దుబ్బాకలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా కెసిఆర్కు ఎనలేని ప్రేమ : మంత్రి హరీష్ రావు
- రాష్ట్రంలో బిజెపి ప్రయోగాలు సాగవు : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
- దుబ్బాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా దుబ్బాకపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉందని, అందుకు నిదర్శనం వంద పడకల హాస్పిటల్, బస్టాండ్, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవన్నీ సీఎం కేసీఆర్ చలువేనని చెప్పక తప్పదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పి ఛైర్మన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారుఖ్ హుస్సేన్, యాదవరెడ్డి పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు కానీ ప్రజలు తెలంగాణ వారనేది సీఎం కేసీఆర్కు ముఖ్యం అన్నారు. దుబ్బాకకు అందం పెరిగే విధంగా ఇవాళ బస్టాండ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి మరువలేనిదన్నారు.బస్టాండ్, తిరుపతి బస్సు కోసం కష్టపడింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే కొబ్బరికాయ కొట్టేందుకు వొచ్చింది ఇంకొకరు అని అన్నారు.
గోవును గోవుగా పూజించేంది మేము, కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీదని వోట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారన్నారు. పక్క పార్టీలను బెదిరించి గుంజుకునే పార్టీ బీజేపీ. బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి. ధరలు పెంచడం తప్ప, జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదు.కోట్ల కొలువులు ఇస్తామని ఇవ్వలే. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బిజెపి చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తప్ప దేశంలో ఎక్కడా కూడా బిడీ కార్మికులకు ఫెన్షన్ లేదని అన్నారు. దుబ్బాకలో మంచినీటి కోసం బిందెలు లొట్టలు పడిన రోజులు గతంలో ఉండేవని నేడు ఇంటింటికి నల్లా నీరు వొస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పంచుడు అయితే ధరలు పెంచుడు వంతు బీజేపీది అన్నారు. మాయమాటలు చెప్పితే మోసపోవడం ఇక కుదరదు. ఎప్పుడు ఎన్నికలు వొచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. అందులో డౌటే లేదని ధీమా వ్యక్తం చేశారు.దుబ్బాక రైతులకు కావాల్సిన అవసరాల దృష్ట్యా నిధులు మంజూరు చేసేందుకు వ్యవసాయ మంత్రి ఒప్పుకున్నారు. దుబ్బాక నియోజక వర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని మంత్రి అన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు ఇక సాగవని, దేశం బిత్తర పోయే విధంగా వ్యవసాయం వృద్ధి చెందిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మూడు సంవత్సరాలలో 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. గతంలో కూడవెల్లి వాగులో దుమ్ము కనిపించేది. ఇవాళ 24గంటలు కూడవెల్లి వాగు పారుతుందన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ పరిశ్రమలు తెచ్చి లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని నిరంజన్ రెడ్డి అన్నారు. కొరోనా సమయంలో సైతం రైతు బంధు ఆపకుండా అన్నదాతకు అండగా నిలిచామని, మళ్లీ మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మిగిలిన సమస్యలను పరిష్కారం చేసుకుంటాం అన్నారు. మంత్రి హరీష్ రావు దుబ్బాక, సిద్ధిపేటలను మోస్తున్నాడని అన్నారు. దుబ్బాకలో చేజారిన ఎమ్మెల్యే పదవి వొచ్చే ఎన్నికల్లో నాలుగింతల రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నానని నిరంజన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేసారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ….దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతున్నామన్నారు. కొంత మంది కల్లిబొల్లి మాటలు చెబుతూ.. పబ్బం గడిపే వారిని నమ్మొద్దున్నారు.మల్లన్నసాగర్ కాలువల పనులు దాదాపు పూర్తి చేశాం.దుబ్బాకలో ఉప ఎన్నికల్లో కోల్పోయిన గులాబీ జెండాను తిరిగి ఎగరవేస్తాం అన్నారు.
చిన్న చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం చేసుకుంటామని, చెల్లాపూర్ – ముస్తాబాద్ డబుల్ రోడ్డు కల. ఇవాళ రూ.13 కోట్లతో ప్రారంభించుకోవడం అభినందనీయం అన్నారు. ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ మాట్లాడుతూ..అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకునేందుకే ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ నాయకులు కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే బీజేపీ వాళ్లు కొట్టుకుపోతారు.అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ వారు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మాట్లాడుతూ…దుబ్బాక మార్కెట్ యార్డుకు మంచి రోజులు వచ్చాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.రాయలసీమను తలపించే విధంగా దుబ్బాకలో రఘునందన్ రావు ప్రవర్తన కనబడింది. దుబ్బాక మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. హరీశ్ రావు లాంటి మంచి వ్యక్తి ఉండగా దుబ్బాకలో ఉప ఎన్నికల్లో ఓడిపోవడం దురదృష్టకరం.బస్టాండు నిర్మాణంకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి ఉంటే.. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు ముందుండడం ఆశ్చర్యం. తిరుపతి వెళ్లడానికి ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సు లెటర్లు అవసరం లేకుండా ఆర్టీసీ బస్సులో వెళ్లే అవకాశం కల్పించాం.హరీశ్ రావు లాంటి వ్యక్తి ఉన్న ప్రాంతంలో ప్రత్యర్థులైన అపోజిషన్ వారికి డిపాజిట్ దక్కదు.కేసీఆర్ ప్రధాన మంత్రి అయితే దేశం మొత్తం తెలంగాణ మాదిరి అభివృద్ధి చెందుతుందని అన్నారు.




