- తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్
- బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తరవాత పెనుమార్పులు
- పోస్టర్ను ఆవిష్కరించిన ఎంపి లక్ష్మణ్
- టిఆర్ఎస్ను పాతరేసి అక్రమ సంపాదన కక్కిస్తాం: ఎంఎల్ఏ ఈటల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుంటున్నారని బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోడీ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వొస్తాయన్నారు. సిటీలో ఫ్లెక్సీ రాజకీయాలను చూస్తుంటే కేసీఆర్ అభద్రతా భావం అర్ధం అవుతుందన్నారు. కేసీఆర్ కిరాయి రాజకీయ బ్రోకర్లను నమ్ముకున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను బీజేపీ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. జులై 2,3 తేదీలలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా సిద్దమవుతుందని, వొచ్చే అతిథుల కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. హెచ్ఐసీసీలోని నోవాటెల్ లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ముఖ్యనేతలు మినహా.. కొంతమంది నేతలు హైదరాబాద్కు ముందే రానున్నారు. ఈ క్రమంలో సమావేశానికి వొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
టిఆర్ఎస్ను పాతరేసి అక్రమ సంపాదన కక్కిస్తాం: ఎంఎల్ఏ ఈటల
బీజేపీ ప్రభంజనాన్ని ఆపడం కేసీఆర్ జేజమ్మ వల్ల కూడా కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ను పాతరేసి, సీఎం కేసీఆర్ దోచుకున్న లక్షల కోట్లను కక్కిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదని, ఆయనో పెద్ద అబద్దాలకోరని ఈటల విమర్శించారు. ప్రజల చెమట బిందువులను దోచుకుతిన్న కేసీఆర్ తత్వమేంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని అన్నారు. ఐదేళ్లు గడిచినా కేసీఆర్ సర్కారు కొత్త పింఛన్ల ఊసే ఎత్తడంలేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్?లో తనను ఓడించేందుకు అమలుచేసిన దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలుచేయాలని డిమాండ్ చేశారు.
రాష్టాన్న్రి అతి తక్కువ కాలంలో అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ సర్కారుదని ఈటల ఆరోపించారు. మద్యానికి బానిసైన రాష్ట్రంగా తెలంగాణను మార్చారని మండిపడ్డారు. ప్రజలు అసహ్యించుకుంటున్నా.. రూ.33 కోట్లు ఖర్చు పెట్టి ప్లెక్సీలు పెట్టుకున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఫొటో ప్లెక్సీల్లో ఉంటే.. మోడీ జనం గుండెల్లో ఉన్నారని ఈటల అభిప్రాయపడ్డారు. బుడ్డపార్టీ టీఆర్ఎస్కు బీజేపీని ఆపే శక్తి లేదని అన్నారు. కాంగ్రెస్కు వోటేస్తే కేసీఆర్కు వేసినట్లేనన్న ఈటల..అందుకు రాహుల్ గాంధీ, కేటీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరగడమే నిదర్శనమని అన్నారు. బీజేపీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసన్న ఆయన..జులై 3న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.




