- వారికి పదవులు ఇస్తే పిచ్చోడి చేతిలో రాయి
- ఒకరు పేల్చుతా అంటే…ఇంకొకరు కూల్చుతానంటరు
- ముమ్మాటికీ మాది కుటుంబ పాలన
- మాది నాలుగు కోట్ల ప్రజల వసుదైక కుటుంబం
- రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయా చెప్పాలి
- రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాం
- భూపాలపల్లి బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రాష్ట్రంలో ఇద్దరు పిచ్చోళ్ళు తిరుగుతూ మాది కుటుంబ పాలన అంటున్నారు… అవును ముమ్మాటికి మాది కుటుంబ పాలనే, మాది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వసుదైక కుటుంబం అని రాష్ట్ర మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాజ్యాంగం ప్రకారమే ఇతర పార్టీలకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నామని అయితే ప్రతిపక్ష నాయకులు ఏం పీక్కుంటారో.. పీక్కొండని ప్రధానమైన మంత్రి హోదాలో ఉండి కేటీఆర్ వివాదాస్పదంగా మాట్లాడారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగం చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భారీ బహిరంగ సభలో కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కాంగ్రెస్ బిజెపి నేతలు తమ పైన, తమ పార్టీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమపై అత్యంత నీచంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్, కేంద్రంలో పదేళ్ల బిజెపి పాలనలో ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. తాము చేసిన అభివృద్ధిని చూపించి ప్రజలను వోట్లు అడగాలి తప్ప ఒక్కసారి అధికారం ఇవ్వాలని బ్రతిమిలాలడం ప్రజలు గమనించాలన్నారు. ఒక్కసారి అధికారం కోసం ప్రాధేయపడడం సిగ్గుచేటన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్లు ఒకడు ప్రగతి భవన్ పేలుస్తానంటే మరొకడు సెక్రటేరియట్ స్కూలుస్తానని చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. వారికి పదవులు ఇస్తే పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం తయారవుతుందని ప్రజలకు సూచించారు. సాగు, తాగునీరు కరెంటు సమస్యలు లేని తెలంగాణ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక కాంగ్రెస్, బిజెపిలు బురద జల్లుతున్నాయని అన్నారు. దేశ ప్రజలంతా తెలంగాణ వైపు చూస్తుంటే విపక్షాలకు కనబడడం లేదని విమర్శించారు. తమని పదేపదే కుటుంబ పాలనంటూ ఎద్దేవా చేస్తున్న ప్రతిపక్షాలకు కచ్చితంగా కుటుంబ పాలన కొనసాగిస్తున్నామన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో ఉంటున్న కుటుంబ పాలన తమదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పెద్దన్నని స్పష్టం చేశారు.
కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు అందజేస్తున్న కేసీఆర్ కుటుంబ పెద్ద కాదా అని ప్రజలను ప్రశ్నించారు. గొల్ల, కురుమలకు, ముదిరాజులకు గౌడన్నలకు నాయి బ్రాహ్మణ రజక కులాలకు అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అందజేస్తున్న కెసిఆర్ కుటుంబ పెద్ద కాక ఏమవుతాడని అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పోరుగు రాష్ట్రాల వారు కూడా అభినందిస్తున్నారని గుర్తు చేశారు. విద్యా, వైద్యం కోసం కోట్లాది నిధులు వెచ్చించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క మంచి పని చేసింది లేదని, దోచుకున్న నల్లధనం అంతా ఒకరిద్దరి దగ్గర దాచిపెడుతున్నాడని మోడీని విమర్శించారు. భూపాలపల్లి అభివృద్ధి కోసం ఇప్పటికే ఎంతగానో నిధులు కేటాయించామని, మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఈ సభలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ పసునూటి దయాకర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ చైర్మన్ సెగ్గమ్ రాణి, వివిధ మండలాలకు చెందిన జడ్పిటిసిలు, ఎంపీపీలు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.




