బంగారు తెలంగాణలో.. బజారునపడ్డ విద్యా వ్యవస్థ !

సమాజంలో అభివృద్ధి అనేది నాణ్యతాయుతమైన విద్యపైననే ఆధారపడి ఉంటుంది.అందుకే ప్రపంచంలో అభివృద్ధిచెందిన దేశాలలో విద్యయొక్క ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.దాదాపు రెండుశతాబ్దాలకుపైగా పరాయిపాలనలో అష్టకష్టాలు పడిన మనదేశం చివరికి స్వాతంత్య్రం సముపార్జించడంలో మనదేశానికి చెందిన చాలామంది విదేశాలలో నాణ్యమైన విద్యనభ్యసించినవారే కీలకపాత్ర వహించడం గమన్హారం.అందుకే వారు ప్రపంచచరిత్రను అధ్యయనం చేయడం ఒక్కెత్తయితే, మనదేశ చరిత్రను, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, స్థితిగతులను  తెలుసుకొని దానికనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి దోహదబడిందని చెప్పడంలో నిజంలేకపోలేదు. స్వాతంత్య్రసంగ్రామంలో భాగంగా 1911లో దాదాబాయి నౌరోజీ,బ్రిటిష్‌ అ‌గ్రపాలకులతో నాదేశాన్ని ఇంకెన్నాళ్లయిన పాలించండి. పర్వాలేదుకానీ మాదేశ బాలబాలికలకు ఉచిత నిర్బంధవిద్యను అందించాలని ప్రాధేయపడటం విద్యయొక్క ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతుంది.

నిజాంపాలనలో సైతం తెలుగుభాషను అవహేళనచేస్తూ,ఉర్దూ మాధ్యమంలో విద్యనందించినప్పుడు తెలుగు భాషోద్యమాలు,గ్రంధాలయోద్యమాలు,రాత్రిసమయాలలో రాత్రిబడులపేర్లతో విద్యనందించడం విద్యపట్ల ప్రయోజనాలను తెలియపరుస్తుంది.అంతెందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌లో సైతం తెలంగాణవాసులకు నియామాకాలలో మోసం జరుగుతుందనే కారణాలతో తొలి,మలిదశ ఉద్యమాలు ప్రారంభంకావడం చూస్తుంటే అభివృద్ధిలో విద్యయొక్క ప్రభావం ఎంత ఉంటుందో అర్థంగాకమానదు.అలాంటి పరిస్థితులలో ఉవ్వెత్తునలేచిన తెలంగాణఉద్యమం ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో విద్యావ్యవస్థ పనితీరు, నియామకాల కల్పనలో జరుగుతున్న పరిస్థితిచూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నదో ప్రతిఒక్కరికి తెలిసిన విషయమే.
‘‘గురుదేవోభవ’’, ‘‘ గురువులేని విద్య – గుడ్డివిద్య’’, ‘‘దేశ భవిష్యత్తు తరగతిగది నాలుగుగోడల్లో నిర్మితమవుతుంది’’ లాంటి వాక్యాలు మాటలుగానే మిగిలిపోతున్నాయా ! అనే అనుమానం కలగకమానదు.ఎందుకంటే ప్రత్యేక తెలంగాణవచ్చి ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయిన, గాడినపడని విద్యావ్యవస్థను చూస్తుంటే నిజమని చెప్పకతప్పదు.

రాష్ట్రంలో 21వేలకుపైగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో 10లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు.కరోనా కారణంగా రెండుసంవత్సరాలపాటు విద్యార్థులు తూ.తూ మంత్రంగానే విద్యనభ్యసించి పైతరగతులకు ప్రమోట్‌ ‌కావడం మూలంగా చదువుల్లో వెనకబడిపోయారని ఇటీవల నాస్‌ ‌సర్వేలో వెళ్లడయ్యింది.ఈ విషయంలో దేశంలోనే మనరాష్ట్రం చివరిస్థానంలో నిల్చడం ఒక్కెత్తయితే, ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు ప్రారంభమై దాదాపు 5నెలలు గడిచిన, ప్రభుత్వపాఠశాలలో యూనిఫామ్స్, ‌పుస్తకాలు అందకపోవడం,సగానికిపైగా పాఠశాలలో ఉచిత మధ్యాహ్న భోజనాలకు స్వస్తిపలకడం, అరకొర వసతులతో విద్యార్థులకు కనీససౌకర్యాలు లేకపోవడం, కొన్నిపాఠశాలలో 30మంది విద్యార్థులు చదివేపాఠశాలల్లో ఒకరిద్దరు ఉపాధ్యాయులు పనిచేయడం చూస్తుంటే.. విద్యాప్రమాణాలు రోజురోజుకు ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది.ప్రభుత్వ ప్రాథమికపాఠశాలలో ఈ ఏడాది ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించాలని తలచి,ప్రభుత్వం తొమ్మిది వారాలపాటు ఉపాధ్యాయులకు శిక్షణతరగతులు నిర్వహించిన విద్యార్థులకు అది ‘‘అందని ద్రాక్షలాగే’’ మిగిలిపోయింది. వివిధ సర్వేల నివేదికలు చూస్తుంటే కనీసం విద్యార్థులకు వ్రాయడం,చదవడంలో నైపుణ్యంలేని విద్యార్థులు అధికశాతంలో ఉండడం మూలంగా వారిలో సామర్థ్యం పెంచేందుకు కేంద్రం ‘‘ఫౌండేషన్‌ ‌లిటరసి న్యూమరసి’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.తెలంగాణలో దీనినే ‘‘తొలిమెట్టు కార్యక్రమం’’ పేరుతో ఆగస్టు 15నుండి అమలుచేస్తున్నారు.రాష్ట్రంలో 4వేల పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు,8వేల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులచే నడుస్తున్నాయి. ఒకరిద్దరూ ఉపాధ్యాయులున్న పాఠశాలలో 4లక్షలకు పైగా విద్యార్థులున్నారు.

 

వారిలో కనీస సామర్ధ్యాలను సాధించేందుకు ‘‘తొలిమెట్టు కార్యక్రమం’’ మూలంగా విద్యార్థులపరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో పడ్డట్లయ్యింది’’.అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు,విద్యార్థులకు పాఠాలు బోధించడానికి సమయం దొరకడం లేదంటే,అదనంగా ప్రతితరగతికి ప్రణాళికలు తయారుచేయడం, వీక్లీ, మంత్లీ రివ్యూ మీటింగ్‌ ‌ల నిర్వహణ వల్ల అసలుకే ఎసరుగా మారింది. విశ్వవిద్యాలయాలు పార్లమెంట్‌ ‌చట్టంమేరకు ఏర్పడ్డాయి.ఇవి జ్ఞానాన్ని సృష్టించి సమాజంలోని ప్రజలను దిశ,నిర్దేశకం చేస్తాయి.అందుకే ప్రొ.రాధాకృష్ణన్‌ ‌కమిటీ ‘‘సమాజానికి విశ్వవిద్యాలయాలు ఆత్మలాంటివని’’ సిఫార్సు చేసింది.కానీ రాష్ట్రంలో ప్రస్తుత విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో వేరేచెప్పనక్కరలేదు.దేశవ్యాప్తంగానున్న విశ్వ విద్యాలయాలల్లో ఖాలీగానున్న ఆచార్య, సహాచార్య కొలువుల భర్తీప్రక్రియను మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని యూనివర్సిటీ గ్రాంట్‌ ‌కమీషన్‌ ‌కోరి సంవత్సరాలు గడిచిపోయిన ‘‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’’అనట్లు ఉండిపోయింది.ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇప్పటివరకు యూనివర్సిటీ కొలువుల రిక్రూట్మెంట్‌ ‌కు సంబంధించిన ఏఒక్క నోటిఫికేషన్‌ ‌రాలేదు.
యూనివర్సిటీలలో ఆచార్యకొలువులభర్తీ నిరుద్యోగులపాలిట అందనిద్రాక్షలా మిగిలిపోయిందని చెప్పవచ్చు.తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించాక ప్రత్యేకంగా మొత్తం 11యూనివర్సిటీ కొలువులను పరిశీలిస్తే 99 ప్రొఫెసర్లు,270 అసోసియేట్‌ ‌ప్రొఫెసర్స్ ‌మరియు 692 అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్స్ ‌మొత్తం 1061 ఖాళీలున్నాయని మొదట లెక్కగట్టి నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోశారు.ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలలో పదవివిరమణ అయిన పోస్టులు మరెన్నోఉన్నాయి.కానీ ఆ ఆశలే వారిపాలిట ఆడియాశలయ్యాయి.ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.ముందుగా యూనివర్సిటీలకు శాశ్విత వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌లేమితో రోస్టర్‌ ‌సిస్టమ్‌ ‌ను త్వరగా చేయడానికి కుదరలేదు.ఆ తర్వాత కొంతకాలానికి అన్నీ యూనివర్సిటీలకు వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌లను నియమించి,యూనివర్సిటీలు సక్రమంగా నడవడానికి కృషిచేస్తూ,రోస్టర్‌ ‌విధానం పూర్తిచేయడం,దానికి తెలంగాణ ప్రభుత్వంసైతం ఒప్పుకోవడం రేపోమాపో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నట్లు దినపత్రికల్లో ప్రకటనలు కాస్తా ఎండమావులా మారుతాయని ఎవరుకూడా ఊహించలేదు.

ఇదిలా ఉంటే ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల వీధికొక పాఠశాలగా ఏర్పడుతూ, ఆకర్షణీయమైన బిల్డింగులు, రంగురంగుల యూనిఫామ్‌ ‌లతో ఎన్నో,మరెన్నో సాకులుచెప్పుతూ, అధికఫీజులు వసూలు చేస్తూ, ‘‘చదువు సారడు – బలపాలు దోశడు’’ సామెత మాదిరిగా వ్యాపారమేలక్ష్యంగా పనిచేస్తున్నాయి.వీటిని ప్రభుత్వంసైతం నియంత్రించకపోవడం అనేది సాధారణ ప్రజలకు గుదిబండగా మారిందని చెప్పవచ్చు.ప్రభుత్వ డిగ్రీ,పీజీ,విశ్వవిద్యాలయాలలో బోధనసిబ్బందిని నియమించకపోగా,విద్యార్థులకు ఫీజులుసైతం పెంచి.గురువులులేని విద్యను అందించడం దేనికినాందియో అర్థంకాని పరిస్థితి.ఈమధ్యనే నాణ్యతాయుతమైన విద్యను,పరిశోధనను అందించాలనే నేపథ్యంతో మరోఐదు ప్రైవేటు  విశ్వవిద్యాలయాలకు అనుమతులివ్వడం చూస్తుంటే పేద,మధ్యతరగతి విద్యార్థులపై ప్రభుత్వానికున్న కపటప్రేమ తెలియకనే తెలుస్తుంది.ఇలా సాధారణ కోర్సులకే కాకుండా వృత్తివిద్య,సాంకేతిక,వైద్య,ఇంజనీరింగ్‌ ‌విద్య పరిస్థితి మరియు విద్యార్థుల సౌకర్యాలు ఎలా ఉన్నాయో ! ప్రతిరోజు దినపత్రికలలో దర్శనమివ్వడం అందరికీ తెలిసిందే.
రాష్ట్రంలో రోజురోజుకు నిరుద్యోగిత పెరిగిపోతుంది.ప్రభుత్వనియామకాల ప్రక్రియ ఆలస్యంకావడం,అరకొర నోటిఫికేషన్‌ ‌వస్తున్న ఉద్యోగాలభర్తీ కాకపోవడం,ప్రభుత్వ కొలువులపై ఆశతో ఎదురుచూస్తున్న ఉన్నతచదువులు చదివిన నిరుద్యోగులపరిస్థితి అద్వానంగా మారిపోయింది.ఈ నెలలో కేంద్రప్రభుత్వానికి చెందిన సిఎంఐఇ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగితరేటు 7.9గా ఉంటే,రాష్ట్రంలో 8.3గా నమోదయి,దేశంలో మనరాష్ట్రం 8వస్థానంలో నిలిచింది.అంటే చదువుకున్న యువతకు కొలువులు రాకపోవడం ఒక్కెత్తయితే,బోధనసిబ్బంది,సౌకర్యాలు లేకుండా బోధించడమనేది ఎంతవరకు సరైనదో ప్రభుత్వమే పునరాలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఆసుపత్రిలోని ఐసీయూలో పడకేసినప్పుడు ప్రభుత్వ పాలకపక్షం,ప్రతిపక్షం రాష్ట్ర రాజకీయనాయకులందరూ ఒక్క మునుగోడు ఉపఎన్నికలో ఎవ్వరికివారు, ఎత్తుకుపైఎత్తులేస్తూ అక్కడే మకాం వేయడం సగటుమనిషిని ఆశ్చర్యానికిలోను చేస్తుంది.ఏదిఏమైనప్పటికీ రాష్ట్రంలోని మేధావివర్గం, ఉన్నత విద్యావంతులు, న్యాయనిపుణులు, ప్రతిఒక్కరు, మరీముఖ్యంగా ప్రసారమాధ్యమాలు జోక్యం కల్పించుకొని విద్యావ్యవస్థను గాడిలో పెట్టుటకు ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని ఆశిద్దాం.

image.png
డా.పోలం సైదులు ముదిరాజ్‌,‌డాక్టర్‌ ఆఫ్‌ ‌ఫిలాసఫీ, 9441930361.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *