- టీపీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్
- పదేళ్లలో ప్రజల ఆకాంక్షలను కాలరాసిన ప్రభుత్వాలు
- నిరంకుశ పాలనను ఓడించడానికి ప్రజలు సమాయత్తం కావాలి
- తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు పిలుపు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. శనివారం ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు-పౌర సమాజ కర్తవ్యం’ పేరుతో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తెలంగాణ 10 ఉమ్మడి జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభోపన్యాసం చేస్తూ…తాజాగా న్యూస్ క్లిక్ జర్నలిస్టులను ఉపా పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం ఇందుకు పరాకాష్ట అని అన్నారు. గత పదేళ్ల పాలనలో దేశ ప్రజల మధ్య, ముఖ్యంగా ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొడుతూ, అధికారం చెలాయిస్తూ, ఆచరణలో కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెడుతుందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయన్నారు. నిరుద్యోగం పెరిగి పోయిందన్నారు. బీజేపీ పాలనను ఓడించకపోతే దేశంలో రాజ్యాంగం మిగలదనీ, కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా మిగలవనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసిందని, తెలంగాణ ఉనికికి అర్థం లేకుండా చేసిందని తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షులు ప్రొఫెసర్ ఎ.కోదండరామ్ విమర్శించారు.
తీవ్ర అవినీతితో పాలన నిండిపోయిందనీ, నియంతృత్వ పోకడలతో పాలన సాగుతున్నదనీ ఆయన విమర్శించారు. గత పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలతో నిండిన పాలనను ఓడించడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం కావాలని, అందుకు ప్రజలను సమీకరించడానికి తీవ్రంగా కృషి చేయాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) నేతలు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మరో వక్తగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ధిక వేత్త డి.నరసింహా రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజల నిజమైన ఆదాయలు పెరగడం లేదనీ, రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యావరణం కూడా అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుందని, ఫార్మాసిటీ, నిమ్జ్, ఇథనాల్ కంపెనీలు, ఓపెన్ కాస్ట్ బొగ్గు మైనింగ్, జీవో 11 రద్దు, వ్యవసాయంలో రసాయనాల పెరుగుదల-ఇవన్నీ పర్యావరణ వ్యతిరేక చార్యలేననీ, వీటిని ఆపకపోతే రాష్ట్ర ప్రజల మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పర్యావరణ శాస్త్రవేత్త, డాక్టర్ కె.బాబూరావు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాలలో కొన్ని ఆధిపత్య కులాల ఆధిపత్యమే నడుస్తున్నదనీ, ఇప్పటికీ వెనుకబడిన, దళిత, ఆదివాసీ వర్గాలకు, మహిళలకు సరైన ప్రాతినిధ్యమే దక్కడం లేదనీ లిస్టు, తెలంగాణ ప్రజల సమాఖ్య నాయకులు పాశం యాదగిరి విమర్శించారు. రాష్ట్రంలో వివిధ రంగాల స్థితిపై ఆయా రంగాలలో పని చేస్తున్న వక్తలు సదస్సులో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పాలనలో రావలసిన మార్పు గురించి నిక్కీ చెప్పారు. విస్సా కిరణ్, ఆదివాసీ వ్యవసాయ రంగంపై రైతు స్వరాజ్య వేదిక నాయకులు డాక్టర్ ఉషా సీతాలక్ష్మి, తెలంగాణ సహజ వనరు గా వ్యవసాయం-ఆదివాసీ హక్కులపై ఉన్న భూమి సమస్యపై కన్నెగంటి రవి, కృష్ణా జలాలపై పాలమూరు అధ్యయన వేదిక నాయకులు ఎం.రాఘవాచారి, భూసేకరణ నిర్వాశితుల మాట్లాడారు. సమస్యపై ఎం. ఆశప్ప రాష్ట్రంలో చట్టబద్ధ హక్కులు అందని కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై వివిధ రంగాల నాయకులు గట్టయ్య(సింగరేణి), రాజిరెడ్డి(ఆర్టీసీ), ఎస్.డి.ఖలీల్(అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులు), సామ్రాజ్యం(హమాలీ), కె.అనురాధ(బీడీ), సలావుద్దీన్(క్యాబ్ డ్రైవర్స్ యూనియన్) మాట్లాడారు.
స్కూల్ విద్యా రంగం సమస్యలపై ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు ఏ.నరసింహారెడ్డి-స్కూల్ విద్య, యూనివర్సిటీ విద్య సమస్యలపై ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర రావు, టెక్నికల్ విద్య రంగ సమస్యలపై ప్రొఫెసర్ వినయ బాబు మాట్లాడారు. తెలంగాణ వైద్యం,ఆరోగ్య రంగం సమస్యలపై డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడారు. దళితుల సమగ్ర అభివృద్ధి, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, బిసి డిక్లరేషన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, ముస్లిం డిక్లరేషన్ సలీం పాషా, మహిళలు, భిన్న లైంగిక సమూహాల సమస్యలపై వి.సంధ్య మాట్లాడారు. జిల్లాలలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం సాగించాలని సదస్సు నిర్ణయించింది. సదస్సుకు వేదిక కో-కన్వీనర్లు అంబటి నాగయ్య, కన్నెగంటి రవి, మైసా శ్రీనివాస్, కరుణాకర్ దేశాయి, సజయ, ప్రొఫెసర్ సమున్నత, సలీం పాషా, ప్రొఫెసర్ వినయ్ బాబు, రాష్ట్ర కమిటీ నాయకులు అనిశెట్టి శంకర్, బి.కొండల రెడ్డి, కె.వేణుగోపాల్, గురువా రెడ్డి నాయకత్వం వహించి నిర్వహించారు.





