మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహణ
పోలింగ్ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు
సూర్యాపేటలో వోటేసిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
వరంగల్, ప్రజాతంత్ర, మే 27 : తెలంగాణలో వరంగల్ – నల్గొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరిగింది. బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.. మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ 49.53 శాతం పోలింగ్ నమోదైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే వోటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను నల్లగొండ స్ట్రాంగ్ రూమ్కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వరంగల్ లో 30 శాతం పోలింగ్ నమోదైంది.
జనగామ జిల్లాలో 28.38 శాతం, హనుమకొండ జిల్లాలో 32.90 శాతం, వరంగల్ జిల్లాలో 31.05 శాతం, మహబూబాబాద్ జిల్లాలో-28.49 శాతం, భూపాలపల్లి జిల్లాలో 27.69 శాతం పోలింగ్ నమోదు కాగా.. ములుగు జిల్లాలో 31.99 శాతం వోటింగ్ నమోదైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, భార్యతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్లో వోటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం భువనగిరి జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్తో కలిసి సందర్శించారు. అటు హనుమకొండలోని పింగిలి జూనియర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటేశారు. ఇటు నకిరేకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సతీ సమేతంగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లా హాలియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. మరోవైపు.. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి సైతం వోటేశారు.
హనుమకొండలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వోటు హక్కు వినియోగించుకున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 600 పోలింగ్ బూత్ ల్లో తమ వోటు హక్కును వినియోగించుకోనున్నారు. 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా.. అత్యధికంగా పురుష వోటర్లే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406 మంది, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో లక్షా 23వేల 985 మంది, నల్గొండ ఉమ్మడి జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఖమ్మం నగరంలో 57 పోలింగ్ కేంద్రాలున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభం అయ్యింది. పోలింగ్ కోసం 129 బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్తో పోలింగ్ పక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని స్ట్రాంగ్ రూంకు తరలింపునకు అధికారులు ఏర్నాట్లు చేసారు. 12 జిల్లాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605 కాగా.. పోలింగ్ కేంద్రాలు, 807 బ్యాలెట్ బాక్సులున్నాయి. పురుష ఓటర్లు…2 లక్షల 88 వేల 189 మంది, మహిళలు లక్ష 75 వేల 645 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు.





