- రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఆయిల్ ఫామ్ వెన్నెముకలాగ అభివృది
- రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ పార్థసారథి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్బంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణా రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీలో ఒక రోజు అయిల్ ఫామ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సి.పార్థసారథి ఆచార్య కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలవేసి వర్క్ షాప్కు హాజరైన రైతులు, యూనివర్సిటీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ… రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఆయిల్ ఫామ్ వెన్నెముకలగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్టప్రభుత్వం విరివిగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం మూలంగా సంవత్సరం పొడవునా భూగర్భ జలాలు అధికంగా లభిస్తు రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు.
ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి సంవత్సరానికి 365 రోజులు నీరు అందించాల్సిన అవసరం ఉందని అందుకు తగ్గట్టు రాష్ట్రంలో 30 లక్షల బోరె•వెల్స్ ఉన్నాయని వాటి కింద 40 లక్షల ఎకరాల భూమికి సాగు నీరు అందించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 2 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందని రానున్న ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తుందని అన్నారు. అంతర్జాతీయంగా ఆహారం, కాస్మోటిక్స్, ఫ్యాక్టరీలలో లూబ్రికేంట్స్, సబ్బులు, క్యాండిల్ తదితర 200 రకాలుగా ఆయిల్ ఫామ్ ను ఉపయోగిస్తున్నారని ఆయిల్ ఫామ్ పంటకు డిమాండ్ తగ్గదని అన్నారు.
దేశంలో వంట నూనెలకు సంబంధించి 65శాతం కేవలం పామాయిల్ మీదనే ఆధారపడి ఉందని దేశానికి సరిపడే ఫామ్ ఆయిల్ దేశంలో ఉత్పత్తి కాకపోవడం మూలంగా వేల కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించి ఇతర దేశాల నుండి పామాయిల్ ను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. దేశంలోని ఆంధప్రదేశ్, తెలంగాణ, కేరళ మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని రాష్ట్రంలో ఉద్యానవన శాస్త్రవేత్తలు పరిశోధించిన మీదట రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పామాయిల్ తోటల పెంపకానికి అనుకూల వాతావరణం ఉందని తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలను అర్జించే ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి మొక్కలను ఉచితంగా అందించి 80శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందించి ప్రోత్సహిస్తుందని పండిన పంటను మార్క్ఫెడ్ ద్వారా స్థానికంగా కొనుగోలు చేసి రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పుతున్న 14 ఫ్యాక్టరీలకు తరలించి వారం రోజులలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తదని అన్నారు.
రాష్ట్రంలో సాధారణ పంటలకు కోతులు, అడవి పందులు, రాళ్ల వాన బెడద ఉంటది కానీ ఆయిల్ ఫామ్కు ఎలాంటి ఉండదని అన్నారు. కూలీలు కూడా ఎక్కువమంది అవసరం ఉండదని అన్నారు. ఆయిల్ ఫామ్ నాటిన 4 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ప్రతి నెల దిగడి వస్తు ప్రభుత్వ ఉద్యోగుల లాగా నెల నెల జీతం మాదిరిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అన్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో సంవత్సరానికి 1 లక్ష 40 వేల నుండి 1 లక్ష యాభై వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు అని అన్నారు. ఒక ఎకరంలో వరి పండించడానికి వాడే నీటితో ఐదు ఎకరాల ఆయిల్ ఫామ్ తోటను సాగు చేయవచ్చని అన్నారు. ప్రతి జిల్లాలో 100 నుండి 200 ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు అభివృద్ధి చేసి రైతులకు చూపించాలని అన్నారు. ఆయిల్ ఫామ్ తోటల చుట్టూ శ్రీగంధం మొక్కలను పెట్టేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. 2014 లో రాష్ట్రంలో కేవలం 30 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ సాగు కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు మూలంగా మరో లక్ష నలభై ఐదు వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలు సాగు జరుగుతుందన్నారు.
మిగతా పంటలకు ఇస్తున్నట్లుగానే ఆయిల్ ఫామ్ పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను అందించాలని అన్నారు. శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి గతంలో వీసీగా పనిచేసిన నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని ఈ విశ్వవిద్యాలయంలో ఉద్యానవన పంటల పరిశోధనవిరివిగా జరగాలని, విద్యార్థులను భాగస్వాములను చేసి పరిశోధన ఫలితాలను రైతులకు అందించాలన్నారు. రాష్ట్ర ఉద్యాన కమిషనర్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ…ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు సాకారం అవుతున్నాయని, రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఆయిల్ ఫామ్ తోటలను పెంచాలని, సాంప్రదాయ పంటలకు అలవాటు పడ్డ రైతులను ఆయిల్ ఫామ్ తోటల పెంపకం వైపు మళ్ళించాలని, అశ్వరావుపేటలో ఆయిల్ ఫామ్ సీడ్స్ గార్డెన్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు ఈ సందర్భంగా యూనివర్సిటీ వార్షిక నివేదిక ప్రతులను ఆవిష్కరించారు. ఈ సెమినార్లో హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గిరిజా ప్రభాకర్, రాష్ట్ర హార్టికల్చర్ అడ్వైజర్ శ్రీనివాస్ రావు, ఇండియన్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సురేష్, గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యానశాఖ జిల్లా అధికారులు, ఉద్యాన శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.




