హైదరబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఆదివారం పెత్తర అమావాస్య సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులను స్మరించుకుని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ బియ్యమిచ్చి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ…ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయిన అమరవీరుల మొత్తం కుటుంబాలకు న్యాయం జరుగలేదని, ఇంకా 600 మందిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమ కారులను మర్చి పోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రాష్ట్రం కోసం పోరాటం చేసిన చాలా మంది ఉద్యమకారులకు లాఠీ దెబ్బలు తాకాయని, ఆరోగ్యం చెడిపోయిందని, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోరాటం చేసిన ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వాళ్ళు ఉన్నారని, ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలను మర్చి పోయిందని కోదండరామ్ మండిపడ్డారు. అమరవీరుల ఆశయ సాధనకు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు చనిపోతున్నారని, అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పక్కా భవనాలు నిర్మించాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని అన్నారు. సిఎం కెసిఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని అన్నారు, కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని కోదండరామ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిజెఎస్ పార్టీ ఉపాధ్యక్షులు గంగాపురం వెంకట్ రెడ్డి, రాజా మల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం నర్సయ్య, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు భద్రాగమ అంజనేయులు, మారం లక్ష్మారెడ్డి, బట్టల రాంచందర్, జశ్వంత్, మహిళా విభాగం నాయకురాలు పుష్ప నీల, యువజన విభాగం నాయకులు ఎర్ర వీరన్న, విద్యార్థి విభాగం నాయకులు రవి నాయక్, శేఖర్ యాదవ్, డప్పు గోపిలు పాల్గొన్నారు.


