హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు..రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. ప్రచారంలో ప్రతిగింజకు బోనస్ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటారా..అంటూ ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం, దగా, నయవంచన అని ఆయన దుయ్యబట్టారు. నీరివ్వరు..కరెంట్ ఇవ్వరు..పంట కూడా సరిగా కొనుగోలు చేయరా…అంటూ నిలదీశారు. రూ.15 వేలు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు.
నమ్మి వోట్లేస్తే గొంతు కోస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్లలెప్లలెనా ప్రశ్నిస్తారు..రైతన్నలతో కాంగ్రెస్ కౌంట్డౌన్ మొదలైందని పేర్కొన్నారు. ఆ పార్టీది వోట్ల నాడు ఓ ముచ్చట..నాట్ల నాడు ఓ ముచ్చట అని ఎద్దేవా చేశారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణ మాఫీ అన్నారని..అది కూడా ఇంకా అమలు చేయలేదని చెప్పారు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గాలిమాటలతో గారడీ చేసిందని, లోక్సభ ఎన్నికల్లో వోట్లు డబ్బాలో పడగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని కెటిఆర్ విమర్శించారు





