కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 04 : ప్రత్యేక కార్యక్రమాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి, పాదయాత్రలు చేస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తూ, క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈవిషయంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల పేరిట నియోజకవర్గవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. నిత్యం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై ఆరా తీస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఆయా విభాగాల అధికారులను వెంటబెట్టుకొని గ్రామాల్లో తిరుగుతూ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతున్నారు. శుక్రవారం ఓల్డ్ బోయిన్పల్లిలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 4వ రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంజయ్య నగర్, పాములు బస్తి, హరిజన బస్తి, అంజయ్య నగర్, అస్మత్ పేట మొదలగు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో అంజయ్య నగర్, అస్మత్ పేట ఆ ప్రాంతంలో ఒకప్పుడు వర్షాలు వచ్చినప్పుడు నాళాలు పొంగి ఎంతో ఇబ్బంది పడే వారమని, నేడు అస్మత్ పేట చెరువు వద్ద కల్వర్టు నిర్మించి చెరువును అభివృద్ధి చేసినందుకు స్థానిక మహిళలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలుపుతూ మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే డ్రైనేజ్ పూడిక తీత వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రజలు తెలియజేయగా వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులకు సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి మానవ వనరుల కొరత ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అతి త్వరలోనే ఈ సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు. అలాగే కొంతమంది మహిళలు డబుల్ బెడ్ రూమ్, పింఛన్లకు సంబంధించి వినతి పత్రాలు అందించగా వాటిని స్వీకరించి సంబంధిత అధికారులకు అందించి వారికి అందుబాటులో ఉండి సమాచారం అందించాలని తెలిపారు. ఈ పాదయాత్రలో అడుగడుగునా మహిళలు, అసోసియేషన్ సభ్యులు, బస్తీ వాసులు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి సాదర స్వాగతం పలుకుతూ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, అధికారులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




