ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం,  పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలు,  సూచనల మేరకు అధికారులు పనిచేయాలన్నారు.  రైతులకు పాసు పుస్తకాలు లేనట్లయితే వ్యవసాయ అధికారుల దృవీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుని వరి ధాన్యం,  పత్తి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  మున్సిపాలిటీ,  గ్రామపంచాయతీలలో పారిశుధ్యం,  హరితహారం,  నర్సరీ పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా మంజూరు అయిన పనులు, కొనసాగుతున్న పనుల విషయాలను సంబంధిత నియోజకవర్గాల శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లాలని సిపిఓ కు సూచించారు.  పంచాయత్ రాజ్,  ఆర్ అండ్ బి ద్వారా జరుగుతున్న  పనుల పురోగతిపై  ఎమ్మెల్యేలకు సమాచారం ఉండాలని కలెక్టర్ తెలిపారు.  అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఎన్నికల ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విధులు నిర్వహించాలని డిపిఓ ను కలెక్టర్ ఆదేశించారు.  జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు.  దారూర్ లో జాతర ముగిసినందున పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు.  పరిగిలో నిర్వహించే ఇస్తమా కార్యక్రమానికి సంబంధించి పనులు మొదలు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  ప్రజావాణిలో 105 అర్జీలు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ , లింగ్యా నాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *