కూకట్ పల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 09 : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక మహిళలు కుండల ప్రదర్శన చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మంచినీటి సమస్య లేకుండా చేసారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలనగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి 8వ రోజు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలనగర్ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యకు పరిష్కారం చేశామన్నారు. నీళ్లు లేక అల్లాడిపోయే బాలనగర్ ప్రజల కోసం వాటర్ ట్యాంక్ ని నిర్మించి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. బాలనగర్ డివిజన్లో ట్రాఫిక్ సమస్య కొరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించామని, పాదయాత్రలో తిరుగుతుంటే అక్కడక్కడ చిన్నపాటి డ్రైనేజీ సమస్యలు ఎదురవుతున్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు ఈ సమస్య తలెత్తిందని దీనిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా పెన్షన్ రాని వారికి కూడా మార్చి నుండి పెన్షన్ వచ్చే విధంగా సహకరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు ఆదేశించారు.




