- తుది దశకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన
- సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమాలోచనలు
- పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి జూపల్లి,
- కవి అందెశ్రీ, కోదండరామ్ తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పోరాటాలకు, త్యాలగాలను ప్రతిబింబింంచే విధంగా రూపొందించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ..బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణా రావు, టిజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపికపై వారు చర్చించారు. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో..గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో సమీక్షించారు.
దీంతో పాటకు సంబంధించి పూర్తిస్థాయిలో కొలిక్కి వొచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. తెలంగాణ రాజముద్రకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా స్పష్టత వొచ్చే అవకాశం ఉంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోగో, గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది. రాజముద్రకు సంబంధించి గతంలో ఉన్న రంగులే ఉండనున్నాయి. కాకపోతే.. గతంలో ఉన్న రాజముద్రకు సంబంధించి అందులో రాచరిక పోకడలు ఉన్నాయని.. తెలంగాణ అనేది ఉద్యమం, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాలను పొందుపరిచేలా రాజముద్ర ఉంటే బాగుటుందనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
అందుకు అనుగుణంగా చిహ్నాలను పొందుపరిచే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్ర గీతాన్ని రూపొందించేందుకు అందెశ్రీకి బాధ్యతలు అప్పగించగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయహే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంకా ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, తదితరులు హాజరయ్యారు. కాగా ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా సోనియాను సిఎం రేవంత్ ఆహ్వానించారు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే