పార్లమెంట్‌ ఎన్నికలపై కసరత్తు

భేటీ అయిన బిజెపి అగ్రనేతలు
పార్లమెంట్‌ నియోజకవర్గాలకు
ఇన్‌ఛార్జుల నియామకం

హైదరాబాద్‌,ప్రజాంత్ర, జనవరి8 :  అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజు కోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందా లని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి పార్టీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. బీజేపీ కార్యాలయంలో కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం ప్రారంభమైంది. బన్సల్‌, తరుణ్‌ చుగ్‌, బండి సంజయ్‌, డీకే అరుణ, లక్ష్మణ్‌, ఈటల, ధర్మపురి అర్వింద్‌, చాడా సురేష్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికలకు అభ్యర్థులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు సమాచారం. మెజారిటీ సీట్లు గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

అసెంబ్లీ ప్లోర్‌ లీడర్‌ ఎంపికపై కూడా కోర్‌ కమిటీ చర్చిస్తోంది. ముఖ్యంగా నేతల మధ్య గ్యాప్‌పై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమన్వయం చేసే బాధ్యతను కిషన్‌ రెడ్డికి బీజేపీ అగ్రనేత అమిత్‌ షా అప్పగించినట్టు తెలుస్తోంది. 35 శాతం ఓట్‌ షేర్‌తో పాటు.. పది పార్లమెంటు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై నేతలు చర్చించనున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ సెగ్మెంట్లకు ఇన్‌ఛార్జీలను నియమించారు. ఆదిలాబాద్‌- పాయల్‌ శంకర్‌, పెద్దపల్లి-రామారావు, నిజామాబాద్‌- ఏలేటి మహేశ్వర్‌రెడ్డి,జహీరాబాద్‌- వెంకటరమణా రెడ్డి,మెదక్‌- హరీష్‌బాబు,కరీంనగర్‌-ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా,మల్కాజ్‌గిరి- రాకేష్‌ రెడ్డి, సికింద్రాబాద్‌-లక్ష్మణ్‌,హైదరాబాద్‌ – రాజాసింగ్‌,చేవెళ్ల- వెంకట్‌నారాయణ రెడ్డి,మహబూబ్‌నగర్‌- రామచంద్రరావు, నాగర్‌కర్నూల్‌- మాగం రంగారెడ్డి, నల్గొండ- చింతల రాంచంద్రారెడ్డి, భువనగిరి- ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, వరంగల్‌- మర్రి శశిధర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌- గరికపాటి రామ్మోహన్‌రావు ఖమ్మం- పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు నియామకం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *