పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం..

  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
  • పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు
  • ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు

హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర డెస్క్, ‌డిసెంబర్‌ 7 : ఆరోగ్య తెలంగాణ దిశగా  తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాథమిక స్థాయిలోనే వ్యాధి నిర్ధారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్‌ ఈజ్‌ ‌బెటర్‌ ‌దన్‌ ‌క్యూర్‌ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది వైద్య ఆరోగ్యశాఖ.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4745 ఏఎన్‌ఎం ‌సబ్‌ ‌సెంటర్లు ఉండగా, ఇందులో 3206 సబ్‌ ‌సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయంచింది. ఈ పల్లె దవాఖానాల్లో 1492 మంది వైద్యులను కాంట్రాక్ట్ ‌పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ జీవో నెంబర్‌ 1563 ‌జారీ చేసింది. వీరి నియమకానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది.

పల్లె దవాఖానాల పని తీరు..
రాష్ట్రంలో 3206 సబ్‌ ‌సెంటర్లను పల్లె దవాఖానాలుగా వైద్య ఆరోగ్యశాఖ మార్చుతుంది. అయితే ఇప్పటికే ఈ సబ్‌ ‌సెంటర్లలో ఎఎన్‌ఎం‌లు, ఆశాలు  రోగికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. ఇప్పుడు వీటిని పల్లె దవాఖానాగా మార్చుతూ, వాటిల్లో 1492 మంది వైద్యులను నియమిస్తుండటంతో, మరింత నాణ్యమైన సేవలు పల్లెల్లో అందనున్నాయి. పల్లె దవాఖానాల్లో అవసరమైన వ్యాధి నిర్థరణ పరీక్షలకు అవసరమైన శాంపిల్స్ ‌సేకరిస్తారు. వాటిని టీ డయాగ్నస్టిక్స్‌కు పంపుతారు.

అక్కడి నుండి వొచ్చిన వ్యాధి నిర్థరణ ఫలితాలను బట్టి వైద్యులు  అవసరమైన చికిత్సను అందిస్తారు. ప్రాథమిక దశలోనే ఈ పల్లె దవాఖానాల ద్వారా వ్యాధి ముదరకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ వ్యాధి తీవ్రత ఉంటే అలాంటి వారిని పల్లె దవాఖానా వైద్యుడు  సీహెచ్‌సీ లేదా ఏరియా, జిల్లా దవాఖానాలకు రిఫర్‌ ‌చేస్తారు.

3206 సబ్‌ ‌సెంటర్లలో ఇక నుండి వైద్యులు…..
రాష్ట్రంలోని 3206 సబ్‌ ‌సెంటర్లలో 1492 మంది వైద్యుల నియామకం  చేయనుండగా, మరో 636 సబ్‌ ‌సెంటర్లు పీహెచ్‌సీల పరిధిలోనే ఉన్నాయి. అంటే మొత్తంగా 3842 సబ్‌ ‌సెంటర్లలో డాక్టర్‌ ‌ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక నుండి  పల్లె ప్రజలకు  అనారోగ్యం వొస్తే పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పల్లెల వద్దకే వైద్య సేవలు అందించనున్నాయి. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలకు మాత్రమే పెద్ద దవాఖానాలకు వెళ్లడం తప్ప, పల్లెల సుస్తిని ఇక పల్లె దవాఖనాలే పొగొట్టనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *