- శుక్రవారం ఉదయం కన్నుమూసిన హీరాబెన్
- హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్న మోదీ
- నిరాడంబరంగా ముగిసిన అంత్యక్రియలు
- పలువురు ప్రముఖులు, బిజెపి నేతల సంతాపం
అహ్మదాబాద్, డిసెంబర్ 30 : ప్రధాని మోదీకి మాతృవియోగం కలిగింది. వందేళ్ల పూర్తి జీవితాన్ని పూర్తి చేసుకున్న హీరాబెన్ కన్నుమూసింది. అస్వస్థతకు గురైన హీరాబెన్ కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా హాస్పిటల్ వర్గాలు గురువారం రాత్రే ప్రకటించాయి. అయితే ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణవార్త తెలుసుకుని వెంటనే ప్రధాని మోడీ అహ్మదాబాద్ చేరుకుని తల్లి హీరాబెన్కు నివాళి అర్పించారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబసభ్యుల సమక్షంలో వారి సంప్రదాయం ప్రకారం హీరాబెన్కు తుది వీడ్కోలు పలికారు. మోడీతో పాటు ఆయన సోదరులు కూడా హీరాబెన్ చితికి నిప్పంటించారు. బతికి ఉన్నంతకాలం హీరాబెన్ అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపారు.
తన కుమారుడు ప్రధాని అయినప్పటికీ.. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఉండేవారు. అంతే నిరాడంబరంగా ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ బుధవారం హాస్పిటల్లో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ.. హుటాహుటిన హాస్పిటల్కి వెళ్లి తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్దే ఉన్నారు. ఆ తర్వాత దిల్లికి వెళ్లారు. హీరాబెన్ను ఒకటి, రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే..హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్ర విషాదంలో నెట్టింది.
హీరాబెన్ మృతి పట్ల పలువురు బీజేపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాతృమూర్తి మరణంతో ప్రధాని మోడీ శుక్రవారం తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ మోడీ రద్దు చేసుకున్నారు. హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ఏడాది జూన్లో హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వొచ్చిన ఆమె వోటు హక్కు కూడా వినియోగించుకున్నారు.
కర్మయోగిలా విలువలకు కట్టుబడిన జీవితం ఆమెది
తల్లి మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్
అహ్మదాబాద్, డిసెంబర్ 30 : తల్లి హీరాబెన్ మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ..నిండు
నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిదని, సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారని చెప్పారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నానని ప్రధాని మోడీ ట్విటర్లో తెలిపారు. తన భావోద్వేగ ట్వీట్లో…‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సు లాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’ అని తెలిపారు.
ప్రధాని మోదీకి మాతృవియోగం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. హీరాబెన్ మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సంతాపం తెలిపారు.




