- రానున్న ఆర్థిక సంవత్సరంలో అంచనా వృద్ధిరేటు 7 శాతం
- 2023-24లో ఆర్థిక వృద్దిరేటు 6-6.8 శాతం ఉండొచ్చు
- కొరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకున్నది
- ఆర్థిక వ్యవస్థపై అధికధరలు, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం
- ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగైన స్థానంలో..
- దేశంలో తగినంతగా విదేశీ మారక ద్రవ్యం
- పార్లమెంట్లో ఆర్థికసర్వే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
న్యూ దిల్లీ, జనవరి 31 : ప్రపంచదేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పార్లమెంట్లో ఆర్ధిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2023-24లో ఆర్ధిక వృద్దిరేటు 6-6.8శాతం ఉండే అవకాశం ఉందన్నారు. రానున్న ఆర్థిక• సంవత్సరంలో 7 శాతం వృద్దిరేటు అంచనా వేశామని, కాని అతి కాస్త తగ్గే అవకాశం ఉందన్నారు. అధికధరలు, ఉక్రెయిన్ యుద్ధం భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపాయన్నారు కేంద్ర మంత్రి. రూపాయి విలువ పతనం కావడం ఆందోళనగా ఉందన్నారు. అయినప్పటికి భారత్ దగ్గర విదేశీ మారకద్రవ్యం తగినంత ఉందన్నారు.
కొరోనా సంక్షోభం నుంచి భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా కోలుకుందన్నారు నిర్మలా సీతారామన్. రాష్ట్రపతి ముర్ము ప్రసంగం అనంతరం మంగళవారం మధ్యాహ్నం 12.50 గంటలకు బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్సభలో సమర్పించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా బుధవారం పార్లమెంట్లో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనితో పాటు, దేశానికి భవిష్యత్తు ఆర్థిక దిశ, పరిస్థితి ఎలా ఉంటుందో.. రేపు దాని బ్లూప్రింట్ దేశం ముందు ఉంటుంది. ఆర్థిక సర్వేలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేయబడినప్పటికీ, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 8.7 శాతంగా ఉంది. 2022-23లో ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
గత ఏడాది, 2021-22 ఆర్థిక సర్వే నివేదికను సమర్పించినప్పుడు, 2022-23లో, భారత ఆర్థిక వ్యవస్థ 8 నుండి 8.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా, ఆర్థిక వృద్ధి రేటు గత సంవత్సరం వ్యక్తం చేసిన అంచనాల కంటే తక్కువగా ఉండవచ్చు. కొరోనా సంక్షోభ సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేశామని.. కొరోనా కారణంగా వ్యవసాయంపై కనీస ప్రభావం కనిపించిందని ఆర్థిక సర్వేలో చెప్పబడింది. అధిక ద్రవ్యోల్బణం రేటు కారణంగా ప్రైవేట్ పెట్టుబడులకు ఆటంకం ఏర్పడింది. అయితే, కొరోనా కారణంగా రెండేళ్లు కష్టమైంది. దాంతోపాటు పాటు ద్రవ్యోల్బణం పాలసీలను ప్రభావితం చేసింది. సరఫరా గొలుసు ద్రవ్యోల్బణం సంక్షోభాన్ని పెంచింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని పెంచింది. కొరోనా అతిపెద్ద ప్రభావం సేవా రంగంపై కనిపించింది. ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. 2022-23 ఆర్ధికసంవత్సరంలో వృద్దిరేటు 7 శాతం ఉండే అవకాశం ఉందన్నారు.





