పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజా యుద్ధనౌక గద్దర్ 11 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు పటాన్ చెరు సిద్దమైంది.తెలంగాణ జాతికి గద్దర్ చేసిన సేవలను ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న సమన్నత లక్ష్యంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో పటాన్ చెరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం ఆవరణలో 11 అడుగుల గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 6 ఫీట్ల గద్దె నిర్మాణంతోపాటు 11 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది.అతి త్వరలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం.





