- ఏకపక్షంగా, బెదిరింపుగా ఉన్నాయి
- దిల్లీ పోలీసుల దాడులను ఖండించిన ఐజెయు
హైదరాబాద్/చండీగఢ్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : న్యూస్క్లిక్ మరియు న్యూస్ పోర్టల్తో సంబంధం ఉన్న జర్నలిస్టుల నివాసాలపై దిల్లీ పోలీసులు పలుమార్లు దాడులు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్టస్ యూనియన్(ఐజెయు) తీవ్రంగా ఖండించింది. ఎలాంటి నోటీసులు, వారెంట్లు లేకుండానే పోలీసులు బలవంతపు చర్యకు పూనుకోవడంతో పాటు జర్నలిస్టులకు చెందిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకోవడంతో దాడులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్ము మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. న్యూస్క్లిక్ న్యూస్ పోర్టల్లో పనిచేస్తున్న లేదా రాస్తున్న పలువురు జర్నలిస్టుల నివాసాలతో సహా కనీసం 30 చోట్ల దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. జర్నలిస్టుల ల్యాప్టాప్లు, మొబైల్స్ను స్వాధీనం చేసుకుని, కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
దీనికి సంబంధించిన కేసు వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. క్రూరమైన ఉపా చట్టం కింద ఆగస్ట్, 2023 కేసుకు సంబంధించి దాడులు జరిగినట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అంతకుముందు, 2021లో ఇదే సంస్థపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా ఒకసారి దాడులు చేశారు. దాడులు ఏకపక్షంగా, బెదిరింపుగా ఉన్నాయని ఐజేయూ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ల్యాప్టాప్లు, మొబైల్లను సీజ్ చేయడం వారి గోప్యతకు భంగం కలిగించడం తప్ప మరొకటి కాదన్నారు. ఈ దాడులు మరియు నిర్బంధాలను మీడియా గొంతు నొక్కే చర్యలుగా పరిగణించాలని ఐజెయు అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ తెలిపారు.





