న్యూదిల్లీ : ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్క్నతి అని ప్రధాని మోదీ విమర్శించారు. దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలుచేస్తున్నాయని అందులో ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ వెనక ఉండి నడిపస్తోందిన మండిపడ్డారు. అయిదు దశాబ్దాల క్రితం వారే కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారు. కానీ.. దేశంపై మాత్రం ఎటువంటి నిబద్ధతను చాటుకోరు.
140 కోట్ల మంది భారతీయులు వారిని ఎందుకు దూరం పెడుతున్నారో ఆశ్చర్యపోనవసరం లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయన్నారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అనుమతించ కూడదన్నారు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లేనని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరుతున్నాం అని న్యాయవాదులు తమ లేఖలో కోరారు.





