ఎండిన పంట పొలాల పరిశీలన
జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదీ..
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : సాగునీరు లేక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని తల్లడిల్లిపోతున్న రైతాంగానికి ఆత్మస్థైర్యాన్ని అందించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆదివారం ఆయన నేరుగా రైతులను కలుసుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కేసీఆర్ పర్యటించి ఎండిపోయిన పంటలను స్వయంగా పరిశీలించనున్నారు.
కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఇదీ…
ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. ఉదయం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి 1:30 గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి నల్లగొండ జిల్లాకు బయలుదేరనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి తిరిగి బయలుదేరుతారు. రోడ్డు మార్గంలోనే ప్రయాణించి రాత్రి 7 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లి కి చేరుకోనున్నారు.




