- టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మారుస్తూ కెసిఆర్కు ఇసి లేఖ
- తెలంగాణ భవన్లో సంబురాలకు సిఎం కెసిఆర్ నిర్ణయం
- పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగనుంది. ఈ వేదిక నుంచి బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు.
వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చాలని ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం విదితమే. ఎట్టకేలకు కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది. దీంతో పార్టీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు.




