ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ. 65 లక్షలతో నూతనంగా నిర్మించే ఎనిమిది దుకాణాల సముదాయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరవుతున్నట్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆమనగలు మార్కెట్ యార్డ్ ఆవరణలో మంత్రి పర్యటన ఏర్పాట్లను గురువారం మార్కెట్ కార్యదర్శి సరోజ, సిబ్బంది, డైరెక్టర్లతో కలిసి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కార్యక్రమానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, సురభి వానీదేవి హాజరవుతున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. ఆమనగల్ మార్కెట్ యార్డు అభివృద్ధికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ లో రైతులకు కావలసిన వసతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రైతుల పండించిన పంట ఉత్పత్తులు మార్కెట్ల విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.




