నేటి నుంచి టీచర్ల బదిలీలు

  • హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్‌
  • ‌రేపటి నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ ‌దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో నేటి నుంచి ప్రభుత్వం బదిలీల పక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయదంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనుంది. తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా..బదిలీల కోసం ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం బదిలీలు కోరుకునేవారు ఈ నెల 3 నుంచి 5 వరకు అన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 6, 7 తేదీల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి. 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు డిస్‌ప్లే చేస్తారు. 10,11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 12, 13న సీనియారిటీ జాబితాలను ప్రచురిస్తారు. 14న ఎడిట్‌ ‌చేసుకునేందుకు ఆప్షన్‌ ఇస్తారు.

15న ఆన్‌లైన్‌ ‌ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టి, 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు. 17, 18, 19 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ‌నుంచి హెచ్‌ఎం‌లుగా పదోన్నతులు ఇస్తారు. 20, 21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్‌ అసిస్టెంట్‌ ‌పోస్టుల ప్రదర్శన చేస్తారు. 21న వెబ్‌ ఆప్షన్లు పెట్టుకుంటే..22న ఎడిట్‌ ఆప్షన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 23, 24 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ ‌బదిలీలు చేపడతారు. 24న స్కూల్‌ అసిస్టెంట్‌ ‌ఖాళీల ప్రదర్శన ఉంటుంది. 26, 27, 28 తేదీల్లో ఎస్టీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతులు పొందుతారు. 29, 30, 31 ఎస్టీటీ ఖాళీల ప్రదర్శన ఉంటుంది. అక్టోబర్‌ 2‌న ఎడిట్‌ ఆప్షన్స్ ఉం‌టాయి. అక్టోబర్‌ 3‌న ఎస్టీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు చేపడతారు. అక్టోబర్‌ 5 ‌నుంచి 19వరకు అప్పీల్‌ ‌చేసుకునే అవకాశం ఇస్తారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ కటాఫ్‌ ‌డేట్‌గా లాంగ్‌ ‌స్టాండింగ్‌కు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాల నిబంధన వర్తించేలా ప్రతిపాదించింది.

లేదా 8 ఏండ్లు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు/ ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాలీలుగా జాబితాలో చేరుస్తారు. రిటైర్మెంట్‌కు మూడు సంవత్సరాలలోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఉంది. అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్‌ ‌చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను ఎడిట్‌ ‌చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పాజ్‌ ‌బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్‌ ఒకటి నాటికి 50 సంవత్సరాల లోపు వయసు ఉండి బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు నిర్బంధ బదిలీ వర్తింప జేస్తూ ప్రతిపాదనలు పంపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *