- బస్సుకు తెలంగాణ భవన్లో పూజలు
- మిర్యాలగూడతో మొదలు…
- మే 10న సిద్ధిపేట సభతో ముగింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర నేడు బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. బుధవారం 24 నుంచి వరుసగా 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే, సమయం తక్కువగా ఉండటం, ఎండ వేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.





