- కమిషన్లు కాంట్రాక్ట్ ఇస్తేనే అభివృద్ధి పనులు..కెసిఆర్ కుటుంబానికి ఉద్యోగాలు పరిమితం
- రాముని వారసులే రామన్నపేట ప్రజలు.. నీరుద్యోగుల, దళితుల పట్ల కపట ప్రేమ
- ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలం
- కెసిఆర్ మోసపూరిత ప్రకటనలకు లోను కావద్దు
- ఎన్నికలు సమయంలో కొత్త వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం
- బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం జామానా పాలనను తలపిస్తున్నాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం రామన్నపేట మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా మహిళలు మంగళహారలతో ఘనంగా స్వాగతం పలికి, రాఖీలు కట్టారు. ఈ పాదయాత్రలో వడ్డెర సంఘం, ఎంఆర్పిఎస్ నాయకులు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. స్థానిక కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు రైతులను ఇస్త్రీ షాపు వారి వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏలు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాముని వారసులే రామన్నపేట ప్రజలు అనడంతో మండలానికి జోష్ వచ్చిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్ లు ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. ఎంతోమంది ఆత్మ బలిదానాల మూలంగా తెలంగాణ సాధించుకున్నామని అందులో యువకులదే కీలక పాత్ర అని అన్నారు. పేదల సంక్షేమాలను మరిచి కెసిఆర్ కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టి కల్వకుంట్ల పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆదుకుంటారని ప్రజలు నమ్మి ఓట్లేసి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే తెలంగాణ ప్రజలను నట్టేట ముంచాడని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబానికి భూములు ఇస్తేనే సాగునీటి కాలువలు పూర్తి జరుగుతాయని జోస్యం చెప్పారు. కెసిఆర్ కుటుంబ సభ్యులకు కమిషన్లు వాటాలు ఇస్తేనే పనులు జరుగుతాయని విమర్శించారు. ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి చర్చలకు పిలుపునివ్వాలని కోరారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్లో నాయకులు మాట్లాడం సిగ్గుచేటని 30 రూపాయల కమిషన్ తీసుకున్న కేసిఆర్ దీనికి జవాబు చెప్పాలని కోరారు.
రైతులు చేనేతలు దళితుల కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని, క్షేమ కోసం భారీగా నిధులు వెచ్చించి ఘనత ప్రధాని కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా మండలానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని సింగిల్ విండో డైరెక్టర్, బిజెపి నాయకులు కన్నేకంటి వెంకటేశ్వర చారి గజమాలతో సత్కరించి, దట్టిని కట్టారు. ఈ కార్య క్రమంలో బి జె.పి. జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి నకిరెకంటి మొగులయ్య, పార్టీ అధ్యక్షులు తాటిపాముల శివకృష్ణ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ కన్నేకంటి వెంకటేశ్వర చారి, నాయకులు దాసరి మల్లేశం, మడూరి ప్రభాకర్ రావు, ఏలూరి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు



