నేను ఎక్కడున్నా ఓ కన్ను ఈ ప్రాంతంపైనే ఉంటుంది..
తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొడంగల్, ప్రజాతంత్ర, మార్చి 28: తన ప్రతీ కష్టంలో కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడ మే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్కు త్వరలో సిమెంటు పరిశ్రమలు రాబోతున్నా యని, ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా.. గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమ లు రాలేదని దుయ్యబట్టారు. పరిశ్రమలు ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువలు పెరుగుతాయని, మన ప్రాంతానికి ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు సులభతరం అవు తుందన్నారు. భూసేకరణలో పట్టా భూములకు,అసైన్డ్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.
అభివృద్ధికి సహకరించకపోతే ఈ ప్రాంతం నష్టపోతుందని తెలిపారు. తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పై ఉంటుందని మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుకుంటాని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇక్కడి ప్రజలకు మేలు జరగాలని.. ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు తీయాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. తాను ఎంత పెద్ద నాయకుడినైనా కొడంగల్ కుటుంబ సభ్యుడినేనని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించాలని కోరారు.
మండల, బూత్, నియోజకవర్గ స్థాయిలో ఐదుగురు సభ్యుల చొప్పున సమన్వయ కమిటీ నియమించుకోవాలని, తాను మళ్లీ ఏప్రిల్ 8న ఇక్కడకు వొస్తానని,మండలాల వారీగా సమన్వయ కమిటీలతో సమావేశమవుతానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఏప్రిల్ 6న సాయంత్రం 5గంటలకు తుక్కుగూడలో జరిగే సభకు నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.



