నాయకులను కొంటారేమో….కార్యకర్తలను, ప్రజలను కొనలేరు

 పార్టీని వీడినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోం
యాసంగికి వరికి రూ.500బోనస్‌ ఇవ్వాలని నిలదీయాలి
 అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి సర్కార్‌
 సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపి ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీమంత్రి హరీష్‌రావు
 రూ.100కోట్లతో పివిఆర్‌ ట్రస్ట్‌ : ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 29: కొంతమంది నాయకులను కొంటారేమో కానీ కార్యకర్తలను, ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ కొనలేదనీ,  పార్టీ ద్వారా పదవులు పొంది ద్రోహం చేసినవాళ్లను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదనీ, ఈ ఎన్నికల్లో యాసంగికి వరికి 500రూపాయల బోనస్‌ ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్‌ పార్టీ నేతలను గ్రామాల్లోకి వచ్చినప్పుడు నిలదీయాలని స్థానిక శాసన సభ్యుడు, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్ధిపేటలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపి పి.వెంకట్రామరెడ ్డ(పివిఆర్‌)ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడా రు. ఎన్నికల సందర్భంగా అనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో గ్రామాలకు వచ్చినప్పుడు వరికి ఇస్తామని చెప్పిన బోనస్‌ ఎగ్గొట్టిన కాంగ్రెస్‌ నేతలను ఎక్కడికక్కడ నిలదీయడమే కాకుండా, మాట తప్పిన కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వోటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలన్నారు. రానే రాదన్న తెలంగాణను కేసీఆర్‌ తెచ్చిపెట్టాడనీ, కేసీఆర్‌ లేని తెలంగాణను ఊహించగలు గుతామా అన్నారు. నాడు కూడా తెలంగాణ ఉద్యమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధు లను కాంగ్రెస్‌ నేతలు తీసుకెళ్లారన్నారు. నాయకులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి, భయబ్రాంతులకు గురిచేసి నాయకులను తీసుకెళ్తారేమో కానీ, కార్యకర్తలను, ప్రజలను కొనలేరన్నారు. పార్టీకి నమ్మకద్రోహం చేసి వెళ్లిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీకి ద్రోహం చేసినోళ్లను కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని, పార్టీని మోసం చేసిన వారిని క్షమించబోమన్నారు.

ఈ పార్లమెంటు ఎన్నికల పరీక్ష, ప్రతిష్ట అని కార్యకర్తలకు దండంపెడు తున్నా.. నా ఎన్నిక కోసం ఎలాగైతే కష్టపడ్డారో ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎంపి అభ్యర్థి పి.వెంకట్రామరెడ్డి గెలుపు కోసం అలాగే కష్టపడాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 9న అధికారంలోకి రాగానే రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశాడన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ఎవరికైనా 2లక్షల రూపాయల రుణమాఫీ అయ్యిందా? 2లక్షల రూపాయల రుణమాఫీ అయిన వారెవరైనా ఉంటే కాంగ్రెస్‌ పార్టీకి వోటు వేయాలని, రుణమాఫీ కానోళ్లందరూ కారు గుర్తుకు వోటు వేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరికి బోనస్‌ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన కాంగ్రెసోళ్లకు వోటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు.

రైతుబంధు ఎకరానికి 15వేల రూపాయలు ఇస్తానని చెప్పాడనీ, ఎకరాకు 10వేల రూపాయలు కూడా ఇవ్వలేదనీ, ఇంకా చాలా మంది రైతులకు రైతుబంధు రాలేదన్నారు. 15వేల రైతుబంధు వచ్చినోళ్లందరూ కాంగ్రెస్‌ పార్టీకి వోటు వేయాలని, రానోళ్లందరూ కారు గుర్తుకు వోటు వేయాలన్నారు. 4వేల రూపాయల పింఛన్‌ అని చెప్పి నమ్మించి వృద్ధులు, బీడీ కార్మికులను మోసం చేశాడన్నారు. 4వేల రూపాయల పింఛన్‌ మాట దేవుడెరుగు రేవంత్‌రెడ్డి సిఎం అయ్యాక జనవరిలో పింఛన్‌ ఎగ్గొట్టాడన్నారు. ఆడబిడ్డల ఖాతాలో ప్రతి నెలా 1న 2500 డబ్బులు వేస్తానని రేవంత్‌రెడ్డి చెప్పాడనీ, ఏ మహిళకైనా ఖాతాలో 2500రూపాయలు పడ్డాయా?అని ప్రశ్నించారు. రైతుబంధు, పింఛన్‌ అధికంగా ఇస్తామంటే ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి తగు గుణపాఠం చెప్పాలన్నారు.

కేసీఆర్‌ మాటంటే మాట ఉండేదనీ, కల్యాణలక్ష్మీ, పింఛన్లు, రైతుబంధు, ఆసరా పింఛన్లు నెల తప్పకుండా ఇచ్చాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మోసం చేసి అక్రమదారుల్లో గద్దెనెక్కిందన్నారు. మోసాల కాంగ్రెస్‌కు కార్యకర్తలు వోట్ల ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. సిద్ధిపేట అభివృద్ధి అంటే గిట్టని బిజెపి నేత రఘునందన్‌రావు మెదక్‌ ఎంపిగా పోటీ చేస్తున్నాడనీ, దుబ్బాక ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే దిల్లీ నుండి రఘునందన్‌రావు నిధులు ఎందుకు తేలేదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు మాయమాటలు చెప్పి గెలిచాడనీ, ఆ తర్వాత నాలుగేళ్లు ఆయన పనితీరును చూసిన దుబ్బాక ప్రజలు 54వేల మెజారిటీతో ఓడిరచాడన్నారు.  సిద్ధిపేట అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తికి వోటు వేయడం అంటే మన కంటిని మన చేతితో పొడుచుకోవడమేనని అన్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా అభివృద్ధికి మంత్రిగా ఎంతో చేశాననీ, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కలెక్టర్‌గా పని చేసిన వెంకట్రామరెడ్డిని గెలిపించడం ద్వారా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చేస్తాడన్నారు. భారీ మెజారిటీతో వెంకట్రామరెడ్డిని గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ గడ్డ మీద ఎలాగైనా గెలవం, సిద్ధిపేటలో 70వేల మెజారిటీ వొస్తుందనీ ఫలాయనం చిత్తగించారన్నారు. ఇచ్చిన మాటపై నిలబడని రఘునందన్‌రావు నమ్మితే మళ్లీ మోసం చేస్తాడన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. రాజకీయంగా గెలవడం కోసం దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, కేరళ ముఖ్యమంత్రి కూతురు, కేసీఆర్‌ కూతురు కవితపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, బిజెపి పార్టీలకు ఈ ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పాలని పార్టీ శ్రేణులకు మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు.

రూ.100కోట్లతో పివిఆర్‌ ట్రస్ట్‌…: ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి
నాకు దేవుడు ఆస్థులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చాడు. ఉమ్మడి కుటుంబాన్ని ఇచ్చాడు. డబ్బులు నా కుటుంబానికి కావల్సినన్ని ఉన్నాయి. రాజకీయాలలో డబ్బులు వద్దు, పైరవీలు వద్దు. మెదక్‌ ఎంపిగా నన్ను కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయమన్నారు. కానీ, నేను కేసీఆర్‌, హరీష్‌రావు శిష్యుడిని. దీంతోనే  కాంగ్రెస్‌ పార్టీ నుండి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించి, బిఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎంపిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.  ఈ ఎన్నికల్లో ఎంపిగా గెలవగానే పార్టీలోని పేదల ఉన్నత చదువుల కోసం పివిఆర్‌ ట్రస్టును ప్రారంభించి 100కోట్ల రూపాయలతో సొంత నిధులతో ట్రస్టు ఏర్పాటు చేయబోతున్నట్లు మెదక్‌ ఎంపి అభ్యర్థి పి.వెంకట్రారెడ్డి తెలిపారు. ఈ 100కోట్ల రూపాయలతో మెదక్‌ పార్లమెంటు పరిధిలోని పార్టీకి చెందిన పేద విద్యార్థులకు చదువుల కోసం వినియోగించుకోవచ్చన్నారు. నేను చనిపోయాక 50ఏళ్ల వరకు మెదక్‌ జిల్లా ప్రాంతం గుర్తించుకునేలా పనులు చేస్తానని అన్నారు. ఈ ట్రస్టుతో పాటు మెదక్‌ ఎంపి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో సొంత డబ్బులతో ఫంక్షన్‌ హాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తానని, ఈ ఫంక్షన్‌ హాల్స్‌లో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలకు కేవలం ఒక రూపాయితోనే ఫంక్షన్‌ హాల్స్‌ను ఇస్తానని ప్రకటించారు. ఎంపిగా గెలిచిన తొమ్మిది నెలల్లోపు 2కోట్ల రూపాయలతో ఫంక్షన్‌ హాల్స్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.  అధికారిగా ఓ మంచి గుర్తింపు ఇచ్చిన ఈ మెదక్‌ గడ్డపై నాపేరు చిరకాలం నిలిచిపోయేలా,  ప్రజలకు మరింత సేవలు చేసేందుకు ఎంపిగా పోటీ చేస్తున్నట్లు పి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరాడు. ఈ సన్నాహాక సమావేశంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *