నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జిల్లాలోని ఎన్నికల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని, నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల ఖరారు, నామినేషన్ల తయారీ ఎన్ కోర్ సాఫ్ట్ వేర్ అవగాహన, పోస్టల్ బ్యాలెట్ కేటాయింపు, సంసిద్ధత, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, సువిధ పోర్టల్, ర్యాండమైజేషన్ తర్వాత పీఓలు, ఏపీఓలకు శిక్షణ కోసం వేదికల గుర్తింపు, పోలింగ్ స్టేషన్ల సందర్శన, పోలింగ్ స్టేషన్లలో ఏవైనా మార్పులు ఎన్నికల వ్యయ బృందాలు తీసుకోవాలిసిన చర్యలు, పలు అంశాలుపై సమీక్ష సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరగా సమర్పించాలని సూచించారు.  దీంతో పాటు నామినేషన్ల తయారీకి సంబంధించి ఎన్కోర్ సాఫ్ట్వేర్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలనిన్నారు. జిల్లాలోని ఐదు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎమ్) స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ పాయింట్లకు సంబంధించి అన్ని రకాల వివరాలను పూర్తి స్థాయిలో అందచేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. జిల్లాలోని ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసే సమయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సువిధ యాప్ ద్వారా ఆయా రాజకీయ పార్టీలు వారు నామినేషన్ వేసేందుకు 48 గంటల ముందు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఈ విషయంలో ఆన్లైన్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా అనుమతి ఇవ్వాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 12,500 పోలింగ్ సిబ్బందికి శిక్షణ అవసరమని అందులో ఒక్కో నియోజకవర్గానికి 2,500 మందికి శిక్షణ కు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు అందరూ తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని అక్కడ అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నది, లేనిది చూసి ఏమైనా వసతులు లేనట్లయితే వెంటనే సమకూర్చాల్సిందిగా అధికారులకు వివరించారు. ఎన్నికల ఖర్చుల బృందం తప్పనిసరిగా ప్రతి రిటర్నింగ్ ఆఫీసును పరిశీలించాలని, అక్కడ రిజిష్ట్రర్లను తప్పకుండా మెయింటెన్ చేయాల్సిందిగా తెలిపారు.  పోలింగ్ స్టేషన్లలో ఏమైనా మార్పులు, చేర్పలు ఉంటే తన దృష్టికి తీసుకొచ్చి తనకు నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకొనే వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్, అభిషేక్ అగస్త్య, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లాలోని ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *