మరో మూడు మెడికల్ కాలేజీలకు అనుమతి
త్వరలో మరో ఆరు మెడికల్ కాలేజీలకు కూడా..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత 240 శాతం పెరిగిన మెడికల్ సీట్లు
డిశ్చార్జీ అయిన పేషెంట్లకు మందులు ఇచ్చి పంపాలి
త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ పూర్తి
టీచింగ్ హాస్పిటళ్ల నెలవారీ సమీక్షలో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు హబ్గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్యం, వైద్య విద్య విషయంలో గడిచిన ఏడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకుని ఎంతో వృద్ధి సాధించామని, ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే కుమ్రంభీం ఆసిఫాబాద్ వంటి మారుమూల జిల్లాతో పాటు, కామారెడ్డి, ఖమ్మం మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడం గొప్ప విషయం అన్నారు. ఇందుకు కృషి చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభించుకునే మిగతా మెడికల్ కాలేజీల అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటికి కూడా పూర్తి అనుమతులు వొస్తాయని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 2014-15లో ఎంబీబీస్ సీట్లు 2950 ఉంటే, ప్రస్తుతం 7090కు చేరాయని, ఇది 240 శాతం పెరుగుదలకు సమానమని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కేవలం 71శాతం. ఇదే విధంగా పీజీ సీట్లు 1183 నుంచి 2548కు చేరాయని, అంటే 111 శాతం పెరుగుదలకు సమానం అన్నారు.
అయితే దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే కేవలం 42 శాతం. సీఎం కేసీఆర్ సంకల్పం ప్రకారం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వొస్తే దేశంలో వైద్య విద్యకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ అవుతుందని, వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లడం బదులు తెలంగాణకు వొస్తారని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, ఇక్కడి విద్యార్థులకు వైద్య విద్య మరింత చేరువ అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో పని చేయాలని, పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని, మొదటి స్థానానికి చేరడంలో కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ వైద్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం మనం అడిగినవన్నీ ఇస్తున్నారని, మెడికల్ కాలేజీలు ఇచ్చారు, వైద్యుల పోస్టులు ఇచ్చారు, వైద్య పరికరాలు ఇచ్చారు…ఇలా అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్నారన్నారు. 65 మందికి కొత్తగా ప్రొఫెసర్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందని, 210 అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లు త్వరలో ఇవ్వబోతున్నామని, త్వరలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ పూర్తి అవుతుందని హరీష్ రావు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు వొచ్చారని, వారికి రోల్ మోడల్గా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండాలని, క్రమశిక్షణగా ఉండేలా చూడాలని, ర్యాగింగ్ లాంటివి లేకుండా చూడాలని సూచించారు. విద్యార్థుల మానసిక స్థితిని తెలుసుకోవాలని, మానసికంగా బలంగా ఉండేలా చూడాలని, ప్రజల ప్రాణలు కాపాడే ఒక గొప్ప వృత్తిలో అడుగు పెట్టబోతున్న విషయాన్ని వారికి వివరించి వారిలో ఉత్సాహం నింపాలని విజ్ఞప్తి చేశారు. 800 మంది పీజీ ఎస్ఆర్ లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు, వైద్య విధాన పరిషత్ ప్రధాన హాస్పిటళ్లకు అవసరం మేరకు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్పెషాలిటీ సేవలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కువగా జిల్లాల్లో వీరిని కేటాయించడం జరిగిందని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
క్లినికల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డ్యూటీల విషయంలో సూపరింటెందెంట్స్ దే లేదా పూర్తి బాధ్యత అని, రౌండ్ ద క్లాక్ సేవలు అందించాలని, అవసరం అయితే తప్ప రెఫర్ చేయకూడదని, స్పెషాలిటీ సేవలు జిల్లా పరిధిలోనే అందాలని మనం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని హరీష్ రావు ఈ సందర్భంగా తెలిపారు.ఎన్ఎంసి నిబంధనలు ప్రకారం నడుచుకునేలా మెడికల్ కాలేజీలను చూడాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ల పైన ఉందని, తరగతులు, అనుమతుల విషయంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని జూచించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ జరిగే దిశగా ప్రయత్నాలు చేయాలని, అవయవ దానం ప్రోత్సహించి, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.ఎక్విప్మెంట్ నిర్వహణ విషయంలో పీఎంయు ఏర్పాటు చేసుకున్నామని, ఐదు లక్షల రూపాయలకు పైబడి విలువ చేసే వైద్య పరికరాల వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరిచాలని, అన్ని వైద్య పరికరాలు పని చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లదేనని స్పష్టం చేశారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి పంపాలని చెప్పామని, ఈ విషయం పేషెంట్లకు తెలిసేలా బోర్డ్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు సూచించారు. రాత్రి వేళల్లో పోస్టుమార్టం జరిగేలా చూడాలని, 56 టిఫా స్కానింగ్ మిషన్లను ఏకకాలంలో ప్రారంభించుకున్నామని, అన్ని వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవాలని, గర్భిణులకు సేవలు అందాలని అన్నారు. కొత్త మెను ప్రకారం డైట్ అందుతుందా లేదా తరుచూ చెక్ చేయాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని, హాస్పిటల్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ఎండాకాలం కాబట్టి పేషెంట్లు, రోగి సహాయకులకు తాగు నీటి సమస్య లేకుండా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేసామని, ప్రతి సోమవారం కమిటీ మానిటరింగ్ చేసుకుంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాస రావు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలి
రాబోయే రోజుల్లో క్యాత్ లాక్ సేవలు
లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు
ఆరోగ్య మహిళ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలి
సిపిఆర్ పై అందరికీ అవగాహన కల్పించాలి
జెడ్పి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీష్ రావు
రాబోయే రోజుల్లో క్యాత్ లాక్ సేవలు
లైసెన్స్ లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు
ఆరోగ్య మహిళ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పించాలి
సిపిఆర్ పై అందరికీ అవగాహన కల్పించాలి
జెడ్పి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : ప్రభుత్వ హాస్పిటళ్లల్లో ఉచితంగా అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జిల్లా పరిషత్ జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వైద్య ఆరోగ్యం, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖలకు సంబంధించి చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ హాస్పిటళ్లను బలోపేతం చేసి, అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు వొచ్చిందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోనీ అన్ని నియోజకవర్గాలలో హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్యను పెంచామన్నారు. గర్భిణీల కోసం జిల్లా హాస్పిటల్లో టిపా స్కాన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. హాస్పిటళ్లలో డాక్టర్లను భర్తీ చేశామని, త్వరలో ఒక్క ఖాళీ లేకుండా నర్సులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈ నెలలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఎన్సీడి కిట్స్ అందిస్తున్నామని, ఈ కిట్స్ అవసరం ఉన్న అందరికీ అందించాలని సూచించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంపై మహిళలకు అవగాహన పెంచాలని, సిపిఆర్పై అందరికీ అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని కోరారు. అన్ని నియోజకవర్గాలలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, అవసరమైన వారు వినియోగించుకునేలా చూడాలని మంత్రి చెప్పారు. లైసెన్స్ లేకుండా అనధికారంగా వైద్యం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో ఏఎన్ఎం సబ్ సెంటర్లు అద్దే భవనాల్లో ఉండకుండా, భవనాలు నిర్మిస్తున్నామని, 54 సబ్ సెంటర్ భవనాల నిర్మాణానికి ఒక్కొక్క దానికి 20 లక్షలు ఇచ్చామని, వాటినింటిని త్వరలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మూడు లక్షల కిలోమీటర్లు దాటిన 108 అంబులెన్స్లు (200) తీసివేసి వాటి స్థానంలో కొత్తవి 200 అంబులెన్స్లను కొనుగోలు చేస్తున్నామని, నెలన్నర లోపు కొత్తవి వొస్తాయని తెలిపారు. కంటి వెలుగు బాగా జరుగుతుందని, జడ్పిటిసిలు ఎంపీపీలు ప్రతిరోజు ఒక్కసారైనా శిబిరాలకు వెళ్లి పరిశీలించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ హాస్పిటళ్లలో 85 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, అందుకు అంకితభావంతో పనిచేస్తున్న డాక్టర్లను వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ఉపాధి హామీ కూలీలతో ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపు పని చేయించాలని, పూర్తి వేజ్ వొచ్చేలా చూడాలని గ్రామీణ అభివృద్ధి అధికారికి సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్ అండ్ బి శాఖల సమన్వయంతో మంజూరైన అన్ని పనులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు సూచించారు. అంతకుముందు ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిపిఆర్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపి బి బి పాటిల్, ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, చంటి క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఎంపీపీలు, జడ్పిటిసిలు, కో ఆప్షన్ మెంబర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




