- ఈ నెల 15న పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సిఎం సమావేశం
- అభ్యర్థులకు బి ఫారాల అందజేత…పార్టీ మేనిఫెస్టో విడుదల
- అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన….
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి…రెండు నియోజకవర్గాల నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు సోమవారం పార్టీ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
మరో వైపు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ నెల 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీ ఫారాలను అధినేత సిఎం కేసీఆర్ అందచేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్ వివరిస్తారు….సూచనలు ఇస్తారు. కాగా..అదే సందర్భంలో ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం అదేరోజున హైదరాబాద్ నుంచి బయలుదేరి, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.





