- ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
మేడిపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 09 : హైదరాబాద్ మహా నగరం నలు దిక్కులా తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి మిషన్ భగీరథ ఓఆర్ఆర్ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మిషన్ భగీరథ ఓఆర్ఆర్ పేజ్-2 పథకంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 9.02 కోట్ల వ్యయంతో రైతుబజార్ వద్ద 2ఎంఎల్ సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు, గూడెం గుట్టపై నిర్మించిన 5 ఎంఎల్ సామర్ధ్యం గల రిజర్వాయర్ను డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనికతతో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీరామారావు మార్గదర్శనిర్ధేనంతో హైదరాబాద్ మహా నగరం ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు రూ. 12 వందల కోట్ల వ్యయంతో భారీ మంచి నీటి పథకానికి సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. కృష్ణా, గోదావరి నదుల జలాలతో నగరవాసుల దాహార్తిని తీర్చే మహాయజ్ఞంలో తెలంగాణ సర్కార్ ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకుని అద్భుత ఫలితాలు సాధిస్తూ సఫలమయ్యిందని తెలిపారు.
దీంతో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో రానున్న అనేక దశాబ్దాల వరకు నీటి కొరత లేకుండా, సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందని మంత్రి వివరించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమన్నది ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. మిషన్ భగీరథ పథకం మహాయజ్ఞం వంటిందని ఆయన అభివర్ణిస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి తడారని గొంతుల దప్పిక తీర్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదన్నారు. దేశ చరిత్రలో వీది నల్లాలు లేని రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాదించిందన్నారు. పేదలకు నీళ్ళందించేందుకు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అర్భన్ ప్రాంతాల్లో ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వడమే గాకుండా, ఉచితంగా ప్రతి నెలా 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దని తెలిపారు. మిషన్ భగీరథ స్కీంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉన్న ఫ్లోరోసిస్ నామరూపాలు లేకుండా మాయమయ్యిందని అన్నారు. మిషన్ భగీరథ పథకం తమ రాష్ట్రాల్లో కూడా కావాలనే డిమాండ్ దేశమంతటా పెరుగుతోందని, ఈ పథకం దేశానికి ఆదర్శమని మంత్రి అన్నారు.
గతంలో ఎండా కాలం వచ్చిందంటే నీటి కటకటతో నిత్యం ఖాళీ బిందెల ప్రదర్శనలు జరిగేవని మంత్రి గుర్తు చేస్తూ, అంతటి దుర్భర స్థితిని రూపుమాపి తెలంగాణ లో నీటి సమస్య లేకుంండా చేసిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కీర్తించారు. చిత్తశుద్ది, ధృడ సంకల్పం, కార్యదీక్ష ఉంటే ఎంతటి సమస్యనైనా అధిగమించొచ్చని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం అమలుతో నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నమ్య నాయక్, కార్పొరేటర్లు పాశం శశిరేఖ, కె. సుభాష్ నాయక్, మద్ది యుగందర్ రెడ్డి, బచ్చ రాజు, అమర్సింగ్, కౌడె పోచయ్య, దొంతిరి హరిశంకర్ రెడ్డి, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎంపల్ల అనంత రెడ్డి, కుర్ర శాలిని, కొల్తూరి మహేష్, కోఆప్షన్ సభ్యులు బొడిగె రాందాసస్ గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, జలమండలి అధికారులు పి. రవికుమార్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బుచ్చి యాదవ్, యాసారం మహేష్, బండి శ్రీరాములు గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, మాడుగుల చంద్రా రెడ్డి, జావిద్, సుక్క జయేందర్, పాశం రాజు యాదవ్, మల్లం వెంకటేష్ గౌడ్, ప్రభు, జలమండలి అధికారులు నిర్మల, రమ్య, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





