నగరం శిఖలో డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌…

జంట నగరాలు సహా అయిదు జిల్లాల ప్రజలకు ప్రయోజనం
ఎన్‌హెచ్‌-44పై రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల మేర నిర్మాణం
నేడు పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన
మలి దశలో దానిపై మెట్రో మార్గం నిర్మాణం

జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌)-44పై దశాబ్ధాలుగా ఎదుర్కుంటున్న వాహనదారుల కష్టాలకు చరమగీతం పాడేందుకు రూ.1,580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల మేర కారిడార్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కండ్లకోయ జంక్షన్‌ సమీపంలో శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఈ రకంగా నగరంలో తొలి డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు నేడు నాంది ప్రస్థానం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌-ఆదిలాబాద్‌ మీదుగా సాగే ఎన్‌హెచ్‌-44పైన జంట నగరాల్లో విపరీతమైన వాహన రద్దీతో నగర ప్రజలు, ప్రయాణికులు నిత్యం పలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్‌లో రహదారి విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్‌కు కంటోన్మెంట్‌ ప్రాంతంలోని నిబంధనలు ఆటంకంగా మారాయి.
సమస్య పరిష్కారానికి గత పాలకులు చిత్తశుద్ది చూపకపోగా, వ్యక్తిగత అహం, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించడంతో రక్షణ శాఖ నుంచి అనుమతులు సాధించలేకపోయారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి ఆ మరుక్షణం నుంచే  ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో రహదారుల విస్తరణ, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో రక్షణ శాఖ స్టాండిరగ్‌ సభ్యునిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఆ కమిటీ సమావేశాల్లోనూ కంటోన్మెంట్‌ ప్రాంతంలో రహదారుల విషయంలో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై చర్చను కొనసాగించేవారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో ఈ అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఢల్లీిలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ ఏడాది జనవరి అయిదో తేదీన స్వయంగా కలిసి రాజధాని నగరంలో కంటోన్మెంట్‌ ప్రాంతంలో రహదారుల విస్తరణ రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని, ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.  వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం ఇలా….
ఎన్‌హెచ్‌-44పై సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి మొదలై తాడ్‌బండ్‌ జంక్షన్‌, బోయినపల్లి జంక్షన్‌ మీదుగా డెయిరీ ఫాం రోడ్డు వద్ద ముగుస్తుంది.  ఈ మొత్తం కారిడార్‌ పొడవు 5.320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్‌ కారిడార్‌ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ 0.600 కి.మీ ఉంటుంది. మొత్తం 131 పియర్స్‌ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తారు. ఎలివేటెడ్‌ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయినపల్లి జంక్షన్‌ సమీపంలో ఇరువైపులా (0.248 కి.మీ. వద్ద), (0.475 కిలోమీటర్‌ వద్ద) రెండు చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు… ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత క్షేమంగా, వేగంగా, సుఖవంతంగా సాగనుంది.
ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో ప్రయోజనాలు…
ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్‌ జంక్షన్‌ వద్ద రోజుకు సగటున 1,57,105 వాహనాలు (ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌ ఫర్‌ డే -పీసీయూ) పయనిస్తుంటే, ఓఆర్‌ ఆర్‌ జంక్షన్‌ సమీపంలో 72,687 వాహనాలు పయనిస్తున్నాయి. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో నిత్యం వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. తరచూ రహదారి ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. క్షతగాత్రులవుతున్నారు.  అత్యవసర సమయాల్లో గమ్యాన్ని చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఒత్తిడి, అసహనానికి గురవుతున్నారు. వాహన రద్దీతో గంటలకొద్ది ట్రాఫిక్‌ నిలిచిపోతుండడంతో ఇంధనానిని భారీగా వ్యయం అవుతోంది.  ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గుతుంది. ప్రమాదాల సంఖ్య తగ్గిపోనుంది.
కారిడార్‌కు సంబంధించి ముఖ్యాంశాలు….
మొత్తం కారిడార్‌ పొడవు : 5.320 కి.మీ….ఎలివేటెడ్‌ కారిడార్‌ పొడవు : 4.650 కి.మీ., అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌ : 0.600 కి.మీ., పియర్స్‌ : 131, అవసరమైన భూమి : 73.16 ఎకరాలు, రక్షణ శాఖ భూమి : 55.85 ఎకరాలు, ప్రైవేట్‌ ల్యాండ్‌ : 8.41 ఎకరాలు, అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌కు : 8.90 ఎకరాలు, ప్రాజెక్టు వ్యయం :  రూ.1,580 కోట్లు, ప్రాజెక్టుతో ప్రయోజనాలు : జాతీయ రహదారి-44లో  సికింద్రాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌ వైపు జిల్లాల  ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి, ఆదిలాబాద్‌ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం, ఇంధనం మిగులుతో వాహననదారులకు తగ్గనున్న వ్యయం, నగరం నుంచి ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా ఓఆర్‌ఆర్‌ వరకు చేరుకునే అవకాశం, మేడ్చల్‌-మల్కాజిగిరి-మెదక్‌-కామారెడ్డి-నిజామాబాద్‌-నిర్మల్‌-ఆదిలాబాద్‌కు ప్రయాణికుల, సరకు రవాణా చేరవేత వేగంగా సాగుతుంది.ఓల్డ్‌ సిటీ కాదు..ఒరిజినల్‌ సిటీ..
అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో మంది కృషి
ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు..
తర్వాత అభివృద్ధిపై దృష్టి
పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపనలో సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ పాత బస్తీ మెట్రోలైన్‌కు శుక్రవారం ఫరూక్‌ నగర్‌ డిపో దగ్గర సీఎం రేవంత్‌ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌ నుమా వరకు మొత్తం 5.5 కిలోవిూటర్ల పొడవునా 4 స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..ఇది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ హైదరాబాద్‌.. అన్నారు. దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్దిపైనే దృష్టి పెడతామన్నారు. మూడేండ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సర్కార్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ కు తాగునీరు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ ది అన్నారు . ఎంజీబీఎస్‌, దారుల్‌ షిఫా జంక్షన్‌, పురాణా హవేలీ, ఇత్తేబాద్‌ చౌక్‌, అలీ జాకోట్ల, విూర్‌ మోమిన్‌ దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్‌ గంజ్‌, అలియా బాద్‌ ప్రాంతాల విూదుగా ఫలక్‌ నుమా వరకు ఈ మెట్రో లైన్‌ నిర్మాణం జరగనుంది.

సాలర్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌ నుమా ఏరియాల్లో స్టేషన్లను నిర్మించనున్నారు. మతపరమైన చారిత్రక కట్టడాలకు డ్యామేజీ లేకుండా రోడ్డు విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేశారు. స్టేషన్ల వద్ద రోడ్డును 120 ఫీట్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ లైన్‌ అందుబాటులోకి వస్తే చార్మినార్‌,సాలర్‌ జంగ్‌ మ్యూజియం వంటి చారిత్రక కట్టడాలను చూసేందుకు పర్యాటకులకు సౌకర్యంగా ఉటుంది. శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం వెంట ఎంపీ అసదుద్దీన్‌ తదితరులు ఉన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌ నుమా వరకు మెట్రోను పొడగించనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోవిూటర్ల పొడవునా ఈ రైలుమార్గంలో 5 మెట్రో స్టేషన్లు ఉంటాయి. దీనికి రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ విూదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. సాలార్‌ జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, షంషిర్‌ గంజ్‌, ఫలక్‌ నుమా మెట్రో స్టేషన్లు ఉంటాయి. మత పరమైన నిర్మాణాలకు ఆటంకాలు సృష్టించకుండా మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. కేటాయించిన నిధుల్లో రూ.వెయ్యి కోట్లు స్థల సేకరణకే వెళ్తాయని అధికారులు చెబుతున్నారు. ఓల్డ్‌ సిటీ మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్‌ కష్టాలు తీరడంతోపాటు పాతబస్తీ మరింత అభివృద్ధి దిశలో దూసుకుపోతుందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *