ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 24: ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే  మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల అన్నారు. శుక్రవారం సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో  ‘ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి – ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి’ ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా శవంతో సమానం పోస్టర్లను జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల, కార్యదర్శి ఖదిజ్ఞాసి సుధాకర్, స్వతంత్ర అభ్యర్థి గువ్వల సంతోష్ కుమార్ లతో కలిసి ఆవిష్కరించారు.ఈ సదర్భంగా అయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ప్రశ్నిస్తూ, నిలువరిస్తూ జైభారత్ గత పదిహేనేళ్లుగా జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ ద్వారా విస్తృతమైన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోందని అన్నారు.జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ మాట్లాడుతూ నాయకుల డబ్బు ప్రలోభానికి లోనైతే ఓటర్లమైన మనం చిల్లరదొంగల కంటే హీనమైపోతామని, అప్పుడు మన ఓట్లతో గెలిచే నాయకులు గజదొంగలై దేశాన్ని కళ్లముందే దోచుకుపోతారని అన్నారు. నాయకులు విసిరే డబ్బుకి మనం ఆశపడుతున్నామంటే- భవిష్యత్తులో ఆ నాయకులు పాల్పడబోయే అవినీతికి మనమే లైసెన్స్ ఇచ్చినట్టవుతుందని హెచ్చరించారు.జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి చొడవరపు వంశీ  మాట్లాడుతూ.. నోటుకి ఐదేళ్ల భవిష్యత్తుని అమ్మిన మనిషి శవంతో సమానం,నాయకులు పోస్తున్న మద్యానికీ, పడేస్తున్న నోటుకీ ఓటుని అమ్ముకుంటున్నందుకు సిగ్గులేదా అని ఓటర్లని పదునుగా ప్రశ్నిస్తూ లక్షలాది పోస్టర్లద్వారా, ఎన్నికలు జరిగిన ప్రతిచోటా ఓటర్లను జైభారత్ జాగృతం చేస్తుందని అన్నారు. జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి  ఖదిజ్ఞాసి సుధాకర్ మాట్లాడుతూ  ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు.ఈ సంధర్భంగా స్వతంత్ర అభ్యర్థి  గువ్వల సంతోష్ కుమార్ మాట్లాడుతూ… ఎన్నికల్లో వోటర్లు  తమ ఓట్లను డబ్బుకి మద్యానికి కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకొని,  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.అనంతరం పట్టణంలో పలు చోట్ల ఫాంప్లెట్స్ ను పంచడం, పోస్టర్లను అతికించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *