దేశ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

  • దిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తం
  • కాశ్మీర్‌లో పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్న నదుల నీటి మట్టం

న్యూ దిల్లీ, జూలై 22 : దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో కూడా అలాంటి ఇబ్బందులే ప్రజలు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా కాశ్మీర్‌లోని చాలా జిల్లాల్లో చెరువులు, కుంటలు, నదుల నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జూలై 20 నుండి నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీనగర్‌ ‌శివార్లతో సహా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలతో సరిహద్దు జిల్లా కుప్వారాలోని జుర్హామా, గందర్‌బాల్‌లోని కంగన్‌ ‌మరియు శ్రీనగర్‌లోని కొండ మరియు బయటి ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రానున్న కొన్ని రోజుల పాటు లోయ ప్రాంతంలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈనెల 25 వరకు వర్షాలు పడుతాయని.. 26 నుంచి వాతావరణ పరిస్థితులు కాస్త మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు గత రాత్రి కురిసిన వర్షానికి లడఖ్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతంలోని లేహ్‌ ‌గాంగిల్స్ ‌ప్రాంతంలో వరద పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉండే దుకాణాలతో పాటు రాజధాని లేహ్‌లోని ప్రధాన మార్కెట్‌లోకి నీటితో పాటు బురద నీరు చేరింది. దీంతో ఉదయం నుండి మార్కెట్లోకి చేరిన శిధిలాలు, బురదను తొలగిస్తున్నారు. అంతకుముందు.. జమ్మూ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో జూలై 19న జమ్మూ-శ్రీనగర్‌ ‌జాతీయ రహదారిని మూసివేయగా.. దోడా మరియు కిష్త్వార్‌ ‌జిల్లాల్లో పాఠశాలలను కూడా మూసివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *