దేశంలో జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణ

  • కాంగ్రెస్‌ ‌జమానాలో దక్కింది రెండు కాలేజీలే
  • బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యం
  • డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో రాష్ట్రం
  • 15న ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభం…ఘనంగా నిర్వహించాలి
  • మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 8 : 15‌న జరిగే మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు మంత్రి కేటీఆర్‌. 15‌వ తేదీన ఏకకాలంలో 9 జిల్లాల్లో మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభంపై ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ ‌టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..15వ తేదీన జరిగే మెడికల్‌ ‌కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 20,000 మందికి తగ్గకుండా ర్యాలీ నిర్వహించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశించారు. దేశంలో జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అని, 50 ఏళ్ల కాంగ్రెస్‌ ‌జమానాలో తెలంగాణకు దక్కింది కేవలం రెండు మెడికల్‌ ‌కాలేజీలే అని ఆయన అన్నారు. 157 మెడికల్‌ ‌కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యమని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజీని ఏర్పాటు చేస్తున్నదని, ఈ దశ ఈనెల 15వ తేదీన 9 మెడికల్‌ ‌కాలేజీలను ఏకకాలంలో ప్రారంభం చేసి చరిత్ర సృష్టించనున్నదన్నారు. జిల్లాకు ఒక మెడికల్‌ ‌కాలేజ్‌ ‌ని ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదని, రాష్ట్రంలోని జనగామ, నిర్మల్‌, ‌కామారెడ్డి, కరీంనగర్‌, ‌సిరిసిల్ల, అసిఫాబాద్‌, ‌భూపాలపల్లి, వికారాబాద్‌, ‌ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్‌ ‌కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఒక మెడికల్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందని, దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కామారెడ్డి లో పాల్గొననున్నారని తెలిపారు.

ఒక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జిల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 15వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. మెడికల్‌ ‌కాలేజీ ప్రారంభం వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లో రిజిస్టర్‌ అయ్యేవిధంగా ఈ కార్యక్రమంలో భారీగా పెద్ద ఎత్తున యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలి. మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు వలన కేవలం విద్యార్థులకే ప్రయోజనం కాకుండా దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్‌ ‌వలన ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయి. మెడికల్‌ ‌కాలేజీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌, ‌బిజెపిల వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలి. రెండు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ ‌మెడికల్‌ ‌కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి.’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.
……………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *