న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 11 : దిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి నేతలను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎపిలో ఈ తొలి అరెస్టుతో కలకలం రేగింది. రాఘవ అరెస్ట్తో ఎపిలోని రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపో యాయి. సౌత్ గ్రూప్ ప్రస్తావనలో రాఘవ పేరు వచ్చిన నేపథ్యంలో.. ఈడీ అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. రాఘవను ఈడీ అధికారులు రెవెన్యూ హౌజ్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇటీవలే ఆడిటర్ బుచ్చిబాబుని అధికారంలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. విచారణలో విస్తుపోయే నిజాలను తెలుసుకున్నారు. దీంతో రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్లో ఈడీ.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ రెడ్డి పేర్లను ప్రస్తావించిన సంగతి విదితమే. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ కీలక పాత్ర వహించిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ టింగ్స్లో శ్రీనివాసుల రెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి ప్రత్యక్షంగా పాల్గన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేల స్టేట్ మెంట్తో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులకు రాఘవరెడ్డి గురించి రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దర్యాప్తు ఆధారంగానే రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ లో మాగుంటకు చెందిన కంపీనీలు కీలక పాత్ర వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మాగుంట ఆగ్రో ఫామ్స్, బాలాజీ డిస్టిలరీస్, ఏంజెల్ షాంపైన్ కంపెనీలు కీలక పాత్ర పోషించినట్లు తెలుసుకున్నారు.
ఈ స్కామ్లో భాగంగా.. సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు విజయ్ నాయర్ ఖాతాలోకి వెళ్లాయని, ఆయన ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో.. ఆ సంస్థలో ఉన్న శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్తో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అయితే.. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని పలు సందర్భాల్లో మాగుంట శ్రీనివాసులు వెల్లడించారు. మరోవైపు.. ఈ కేసులో ఇటీవల సిబిఐ అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో.. నేడు రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో బుచ్చిబాబును సిబిఐ ప్రవేశపెట్టనుంది.




