న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరస్టయి ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు న్యాయస్థానం మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. సీబీఐ విజ్ఞప్తితో ఈ మేరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగిస్తూ.. తదుపరి విచారణ మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బుచ్చిబాబును ఈనెల 8న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేసులో తెలంగాణ నుంచి అభిషేక్ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే కావడం గమనార్హం.
బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించిన సీబీఐ అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. గతంలో కూడా సీబీఐ, ఈడీ బుచ్చిబాబును పలుమార్లు ప్రశ్నించాయి. పంజాబ్కు చెందిన వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను కూడా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ విధానం రూపకల్పన, అమలులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని, దాని వల్ల హైదరాబాద్కు చెందిన హోల్ సేల్, రిటైల్ లైసెన్సీలకు, వారి ద్వారా ప్రయోజనం పొందిన వారికి అక్రమ లాభాలు సమకూరాయని సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కవిత జాగృతి సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచీ ఆమె ఆడిటర్గా ఉన్న బుచ్చిబాబు.. మంత్రి కేటీఆర్కు, ఆయన సన్నిహిత నేతలకు కూడా ఆడిటర్గా పనిచేశారు.




