- ఫలితాలతో ఆప్ కార్యకర్తల్లో జోష్
- తొలిసారిగా ఆప్ నుంచి గెలిచిన ట్రాన్స్జెండర్
న్యూ దిల్లీ, డిసెంబర్ 7 : దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఆప్ మెజారిటీ సాధించి మరోసారి పీఠం దక్కించుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను 134 స్థానల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిపొందింది. ఇక కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచింది. మరోవైపు ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. విజయోత్సవాలకు కేజీవ్రాల్ ఇంటివద్దకు ఆ పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. బిజెపి నుంచి గట్టిపోటీ ఎదుర్కున్నా ఆప్ స్పష్టమైన మెజారిటీ సాధించడం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందిజ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు అవసరమైన 126 వార్డులను సునాయాసంగా కైవసం చేసుకుంది. ఎంసీడీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కనబర్చడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.
మూడు బాడీలుగా ఉన్న దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గొడుగు కిందకు తెచ్చింది కేంద్రం ప్రభుత్వం. ఈ ఏడాది మేలో బిల్లు పెట్టి.. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ కార్పొరేషన్లను రద్దు చేసి.. మూడింటిని కలిపి ఒకే మున్సిపల్ కార్పోరేషన్గా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీగా ఏర్పాటు చేసి..వార్డులను 250స్థానాలకు కుదించారు. మొత్తం 250 వార్డులకు గాను 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అన్ని పార్టీలు దిల్లీ మున్సిపల్ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. ఇదిలావుంటే దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్రాన్స్ జెండర్ అభ్యర్థి బాబీ కిన్నార్.. సుల్తాన్ పురిఏ వార్డు నుంచి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బాబీ 6,714 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకా పై గెలిచారు.
తనను గెలిపించిన వారికి బాబీ ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో అవినీతిని పారద్రోలేందుకు పోరాటం చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. బాబీ కిన్నార్ సామాజిక కార్యకర్త. అన్నా హజారేతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. 2017లో జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బాబీ కిన్నార్కు టికెట్ ఇచ్చింది. ఓ ట్రాన్స్ జెండర్ అభ్యర్థికి దిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి.



