తిరిగి ప్రమాదకర స్థాయికి కాలుష్యం
పంట వ్యర్థాలను తగులబెట్టడంతో పాటు వాహనాల పొగ
పరస్పర విమర్శలతో సమస్యపై కప్పదాటులో ఆప్, బిజెపిలు
దిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో వాయు నాణ్యత సూచి 408కి చేరుకోగా.. ’తీవ్రత’ విభాగానికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పొరుగు రాష్టాల్ల్రో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో పాటు వాహనాల నుండి వచ్చే పొగతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిపారు. మంగళవారం 424గా ఉన్న ఎక్యూఐ బుధవారం నాటికి 376కి మెరుగైంది. గతేడాది డిసెంబర్ 26న ఎక్యూఐ 459కి చేరుకుందని, ఇది అతిచెత్తరికార్డుగా పేర్కొన్నారు. విషపూరిత గాలిని పీల్చడంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పిఎం 2.5 మైక్రాను లేదా అంతకంటే తక్కువగా ఉండే సూక్ష్మ ధూళికణాలు శ్వాసనాళాల గుండా ఊపిరితిత్తుల్లోకి అక్కడి నుండి రక్తప్రవాహం లోకి చేరతాయని అన్నారు. దీంతో శ్వాస, ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే సమయం కావడంతో చిన్నారులు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. వాయు నాణ్యతా ప్రమాణాలు మెరుగయ్యేంతవరకు పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించాలని చిన్నారుల హక్కుల సంఘం బుధవారం ముఖ్యమంత్రి కేజీవ్రాల్కి విజ్ఞప్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కొన్ని ప్రేవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఆన్లైన్ తరగతులు నడపనున్నట్లు సమాచారం. అయితే పాఠశాలలు మూసివేత ఈ సమస్యకు పరిష్కారం కాదని.. కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు దీర్ఘకాల చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు వాయు కాలుష్యంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు, ఢిల్లీ, పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
దేశంలో వాయు కాలుష్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని, బీజేపీ పాలిత రాష్ట్రాల పేర్లు ప్రస్తావిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిని గ్యాస్ ఛాంబర్గా మార్చిందని ఆరోపించారు. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఉన్న పంజాబ్లో 2021లో వ్యవసాయ పొలాల్లో మంటలు 19శాతంపైగా పెరిగాయని, హర్యానాలో 30.6శాతం తగ్గుదల కనిపించిందని భూపేంద్రయాదవ్ ట్విట్టర్ లో తెలిపారు. బుధవారం పంజాబ్లో 3,634 వ్యవసాయ పొలాల్లో మంటలు సంభవించాయని తెలిపారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉన్న చోట కుంభకోణాలే ఉంటాయని ఆరోపించారు. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలను కేంద్రమంత్రి ప్రస్తావించారు. పంట అవశేషాల నిర్వహణ యంత్రాల కోసం కేంద్ర ప్రభుత్వం పంజాబ్కు రూ. 1,347 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 యంత్రాలను కొనుగోలు చేసిందని, వాటిలో 11,275 యంత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. పంట అవశేషాల నిర్వహణ యంత్రాల కోసం కేంద్ర ప్రభుత్వం పంజాబ్కు ఈఏడాది రూ. 280 కోట్లు ఇచ్చిందని, గత సంవత్సరం ఖర్చు చేయకుండా మిగిలిన రూ. 212 కోట్లతో కలిపి సుమారు రూ.492 కోట్లు అందుబాటులో ఉన్నా, రైతులకు అవసరమైన యంత్రాలు కొనుగోలు చేయకుండా, పంటలను రైతులు తగలబెట్టడానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కారణమవుతుందని విమర్శించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి తన సొంత ప్రాంతంలో రైతులకు ఉపశమనం కలిగించడంలో కూడా విఫలమయ్యారని, గత సంవత్సరం సంగ్రూర్లో పంటలను తగలబెట్టిన ఘటనలు 1,266 కాగా, ఈ సంవత్సరం అదే సమయానికి 139శాతం పెరిగి 3,025కి పెరిగాయని, ముఖ్యమంత్రి అసమర్థతే దీనికి కారణమని భూపేంద్రయాదవ్ అన్నారు. కాలుష్యం సమస్య ఉత్తరభారతదేశం మొత్తం ఉందని, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో్ర వాయు కాలుష్యం సమస్య ఉందని, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు అన్ని చోట్లా సమానంగా ఉందని, ఢిల్లీ-పంజాబ్ మాత్రమే దేశమంతటా కాలుష్యాన్ని వ్యాపింపజేసిందా అంటూ ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ అరవింద్ కేజీవ్రాల్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో భూపేంద్రయాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజీవ్రాల్ ధీటైన జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం చేయడం లేదని, వారిపై ఎఫ్ఐఆర్లు మాత్రమే నమోదు చేస్తోందని, వాయు కాలుష్యం విషయంలో తమ గోడు పట్టించుకోవడం లేదని, రాజకీయ ప్రయోజనాలనే బీజేపీ ప్రభుత్వం చూసుకుంటోందని ఆమ్ ఆద్మీ అధినేత విమర్శించారు.మరోవైపు బీజేపీ విమర్శలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కౌంటర్ ఇచ్చారు. రైతుల ఆందోళన కారణంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవల్సి వచ్చిందని, దీంతో రైతులపై కేందప్రభత్వం కక్ష గట్టిందని ఆరోపించారు.
దిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
గాలి కాలుష్యం భారత్కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే నివారించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీ పొరుగు రాష్టాల్ల్రో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు తగులబెడుతున్న తరుణంలో దేశ రాజధానిలో భారీగా కాలుష్యం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పర్యావరణం కోసం కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇది ఓ పెద్ద సమస్య అన్నారు. క్లీన్ ఫ్యూయల్స్-2022పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ఆయన.. ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు.వరి పొట్టును బయో విటమిన్గా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశంలో అనేక విజయవంతమైన ప్రాజెక్టులున్నాయని, వరిగడ్డితో బయో-సీఎన్జీ, బయో ఎల్ఎన్జీని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా రంగాన్ని డీ కార్బనైజ్ చేసి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాన్ని నిలకడగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్జీ, బయో ఎల్ఎన్జీ, బయో డీజిల్, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ వంటి స్వచ్ఛమైన.. గ్రీన్ జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛమైన ఇంధనం బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుందన్న ఆయన.. చమురు దిగుమతి బిల్లులను తగ్గిస్తుంది, ఇంధన భద్రత, వాయు కాలుష్యం తగ్గుదలను నిర్దారిస్తుందని చెప్పారు.




