హిమాయత్నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : లంబాడిలో ఉపకులమైన దాడి లంబాడిల డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని డాడీ లంబాడి హక్కుల సాధన సమితి(డిఎల్ హెచ్ఎస్ఎస్) వ్యవస్థాపక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రుణావత్ రఘు నాయక్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజక వర్గాల్లో ధాడీ ఢాల్య లంబాడీల ఆధ్వర్యంలో ప్రతి నియోజక వర్గంలో 50 మందితో అసెంబ్లీ ఎన్నికల్లో సామూహికంగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాడి లంబాడిలు రాష్ట్రంలో ఐదు నుంచి ఆరు లక్షల వరకు జనాభా కలిగి ఉందన్నారు. తమకు ఎస్టీ రెజర్వేషన్లు ఉన్నప్పటికీ లంబాడిలలో ఉపతెగలైనా దాడి, డాలియా, సనార్, గోర్, బట్ తదితర ఉప తెగలు అన్ని రంగాలల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉపకులాల సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలని కోరారు. ధాడీ ఢాల్య అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలన్నారు. విద్య ఉద్యోగ రాజకీయ రంగాలన్నింటిలో ధాడీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. డాడీల జీవన స్థితిపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి సాంస్కృతి సాంప్రదాయలను కాపాడుతూ చరిత్రను సభ్యసమాజాన్ని తెలియజేయాలన్నారు.
దాడి లంబాడిల అభివృద్ధికి హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు





