వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: దసరా వేడుకలు నిర్వహించుకునే ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాల్లో పరిసరాలు పరిశుభ్రం చేసి వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ సిబ్బందికి అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాలను దసరా పండుగ వేడుకలకు నిర్వహిస్తున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం.. విజయదశమి పండగను పురస్కరించుకొని మున్సిపల్ నిధులతో పండుగ రోజు ఆలంపల్లి బోనమ్మ గుడి దగ్గర జరగబోయే శమీపూజ, రావణ దహనం ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని, ఏర్పాట్లలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్ రామస్వామి, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్యామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దసరా వేడుకల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి



