దళిత బహుజన పార్టీ అభ్యర్థులకు మాలమహానాడు మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : అసెంబ్లీ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ(డిబిపి) అభ్యర్థులకు మాలమహానాడు సంస్థ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హిమాయత్‌నగర్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ను మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, హై కోర్ట్ అడ్వకేట్ డాక్టర్ విఎల్.రావు, జాతీయ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జెఎన్.రావు కలిసి మద్దతు తెలిపారు. దళితుల ఐక్యత కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కృష్ణ మాదిగ కుట్రను ఎదుర్కొంటూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గత 25 ఏళ్ళుగా బలమైన గళం వినిపిస్తున్న దళిత బహుజన పార్టీ అధినేత కృష్ణ స్వరూప్ పార్టీ నాయకత్వానికి మాలల మద్దతు ఉంటుందన్నారు. కొంతమంది మాలమహానాడు నేతలుగా చెలామణి అవుతున్న చిల్లర బ్రోకర్ లు వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన కెసిఆర్ పార్టీకి పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిలకు, బీజేపీ మోడీ, కిషన్ రెడ్డిలకు మద్దతు ప్రకటించడం అత్యంత సిగ్గు చేటన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటూ మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతిసిన దోపిడీ కులాల పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రకటించారు. డిబిపి పోటీ చేయలేని స్థానాల్లో ఆర్.పి.ఐ స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ దళిత విచ్చిన్నం చర్యలకు వ్యతిరేకంగా దళితుల రాజ్యాధికారం సాధన కోసం రాజకీయ పోరాటం చేస్తున్నామని ప్రకటించారు. డిబిపికి మద్దతు తెలిపడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *