ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 25 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం ఆమోదయోగ్యం అని ప్రజా సైన్యం పార్టీ జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ అన్నారు. దళిత పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ గృహలక్ష్మి పథకాన్ని నిరంతరం కొనసాగించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, పేదవాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ స్థలం ఉన్నా అర్హులుగా ప్రభుత్వం గుర్తించాలని, రాబోవు ఎన్నికల లోపు కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని పేదలకు చేరువ చేస్తే ప్రజల నమ్మకాన్ని చూరగొన్న వారవుతారని అన్నారు. ఈ పథకంపై పేదలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని అన్నారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి అట్టడుగు ప్రజల సొంతింటి కల సాకారం చేయాలని సీఎం కేసీఆర్ సముచితమైన నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధులో దళారుల జోక్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీకి ప్రజా సైన్యం పార్టీ బాసటగా నిలుస్తుందని అన్నారు.



