యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఓ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తేజ ఫుడ్ ఇండస్ట్రీ కూలీలతో వెళ్తున్న ఆటోను, అదే సంస్థకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో హాస్పిటల్కు తరలిస్తుండగా నలుగురు మహిళలు మృతి చెందారు. మృతులు చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో శిరీష, ధనలక్ష్మి, నాగలక్ష్మి, అనసూయ ఉన్నట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.




